జయశంకర్ భూపాలపల్లి, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడటంతో ముగ్గురు మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొర్కిశాలకు చెందిన సుకినె దేవరావు, మోహన్నావు అన్నదమ్ములు. తమ వ్యవసాయ బావిలో నీరు రాకపోవడంతో ఇటీవల క్రేన్తో పూడికతీత పనులు చేపట్టారు. శనివారం బకెట్లో పెద్ద బండతో పాటు మట్టిని నింపారు. ఈ క్రమంలో బకెట్లో బరువు ఎక్కువై క్రేన్ బావిలో పడిపోయింది. దీంతో బావిలో ఉన్న భూ యజమాని సుకిమె దేవరావు (48), కూలీ సరిగొమ్ముల పైడయ్య (53)తో పాటు పదోతరగతి విద్యార్థి బండారి అభిలాష్ అక్కడికక్కడే మృతి చెందారు. బావి యజమాని సోదరుడు మోహన్రావుకు సైతం తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
ప్రాణం తీసిన సరదా..
కొర్కిశాల గ్రామానికి చెందిన బండారి అభిలాష్ (16) పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి చేరుకుని పక్కనే క్రేన్తో బావి పూడికతీత పనులు జరుగుతుండగా చూసేందుకు వెళ్లాడు. సరదాగా క్రేన్పై కూర్చుని పూడికతీతను చూస్తున్నాడు. క్రేన్ హఠాత్తుగా బావిలో పడిపోవడంతో అభిలాష్ సైతం బావిలో పడి మృత్యువు ఒడిలో చేరాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చిట్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చిట్యాల సీఐ మల్లేశ్, మొగుళ్లపల్లి, గణపురం ఎస్సైలు సురేశ్, అశోక్ పరిశీలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.