హైదరాబాద్, జూన్ 18 (నమస్తేతెలంగాణ) : పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అంతా కలిసి పనిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టం చేశారు. గురువారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీభవన్లో సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టులు భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో మాజీ మావోయిస్టులు దేవ్జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక, సంజీవ్, బండిప్రకాశ్ సీపీఎం నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వారు రెండు గంటలకుపైగా చర్చించారు. అనంతరం జాన్వెస్లీ మాట్లాడుతూ దేశంలో మావోయిస్టులను ఏరివేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిరంకుశంగా చేపట్టి నరమేధాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చిన వారు ప్రజాఉద్యమాల్లో నిలబడి ముందుకు రావాలని కోరారు.