చౌటుప్పల్ : తాము గెలుస్తామన్న నమ్మకం బీజేపీ కార్యకర్తల్లో లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తానన్న ప్రధాని మోదీ ఎందుకు వెలికి తీయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను సర్వనాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్రెడ్డిపై ప్రజల్లో విముఖత ఉన్నదని తెలిపారు. కుట్రపూరితంగా తెలంగాణలో ఉప ఎన్నిక తెచ్చి, గెలుపొందడం ద్వారా తెలంగాణలో తాము అధికారం చేజిక్కించుకుందామనే బీజేపీ ఆశలు అడియాశలు కాబోతున్నాయని జోస్యం చెప్పారు. మతాలు కులాల మధ్య చిచ్చులు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
సీపీఎం, సీపీఐ నాయకుల కలయికతో టీఆర్ఎస్ ఎంతో బలంగా మారిందని, ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. ప్రతిఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, పట్టణ కార్యదర్శి బండారు నరసింహ, నాయకులు నర్సిరెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.