హుస్నాబాద్, మే 15: దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని డిపో గ్రౌండ్లో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతతత్వాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తున్నదని అన్నారు. ఇందుకు వ్యతిరేకంగా పోరాడే పార్టీలు, సంఘాలు ఒక్కటై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా మోదీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
మోదీ నోట్ల రద్దు వల్ల కోటీశ్వరులు లాభపడ్డారన్న నారాయణ.. రూ. 13 లక్షల కోట్ల సబ్సిడీలను కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి పేద, మధ్య తరగతి ప్రజలకు మొండిచేయి చూపించారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీ ట్యాక్సులను 33 శాతం నుంచి 28 శాతానికి తగ్గించారని, అదే సమయంలో పేదలు ఉపయోగించే వస్తువులపై 5 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచడం దారుణమన్నారు. వారసులు లేరంటూనే 30 మంది దత్తపుత్రులను మోదీ పోషిస్తున్నారని నారాయణ ఆరోపించారు. స్మగ్లర్ అయిన అదానీని అందలం ఎక్కించారని, క్రిమినల్ అయిన అమిత్షాను హోంమంత్రిని చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.