హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కోరారు. బీహార్, ఢిల్లీ, జార్ఖండ్తోపాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను సైతం కలవాలని సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లి నితీశ్కుమార్ను కలవడం కీలక పరిణామమని పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను బీజేపీ వేధిస్తున్నదని, ఎన్నికల కమిషన్, గవర్నర్ను అడ్డం పెట్టుకొని జార్ఖండ్ ముఖ్యమంత్రిపై అనర్హత వేటుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు ఆదివాసీని రాష్ట్రపతిని చేశామని చెప్పుకొంటూ మరోవైపు ఆదివాసీ సీఎం గొంతు కోస్తారా? అని నిలదీశారు.
ఎన్నికల కమిషన్ రాజ్యాంగ స్వయంప్రతిపత్తిని మరిచి ప్రధాని మోదీ చేతిలో పావులాగా మారడం దుర్మార్గమని మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం అడ్డదారులు తొకుతున్నదని దుయ్యబట్టారు. మొన్నటివరకు కేసీఆర్ జోలికిరాని కేంద్రం ఆయన నిలదీస్తుండటంతో సీబీఐ, ఈడీలతో దాడికి ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ ఇలాంటి వారిని దగ్గరకు కూడా రానిచ్చే వారు కాదని చెప్పారు. కేంద్రం దేశాన్ని దోచిపెడుతుండటం వల్లనే అదానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో మూడో స్థానం పొందారని విమర్శించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అదానీ ఒక స్మగ్లర్ అని, ఇప్పుడు కూడా ఆయన ముంద్రా పోర్టు నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టు, బొంబాయి ఎయిర్పోర్టును బలవంతంగా ఇతరుల నుంచి లాకొని అదానీకి కట్టబెట్టారని మండిపడ్డారు.
ఈ నెల 4 నుంచి 7 వరకు శంషాబాద్లో నిర్వహించనున్న సీపీఐ రాష్ట్ర మూడో మహాసభల నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనీయబోమని, ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించామని చెప్పారు.