హైదరాబాద్ : రాష్ర్టంలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు వెల్లడించారు. 83 లక్షల మందికి మొదటి డోసు టీకా ఇచ్చామన్నారు. మొత్తం 2.2 కోట్ల మందికి టీకా ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100 కేంద్రాల ద్వారా టీకాలు ఇస్తున్నామని తెలిపారు. 24 మొబైల్ వ్యాన్ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎంసీలో రోజుకు 1500 మందికి పైగా టీకాలు ఇస్తున్నామని చెప్పారు. నిన్నటి నుంచి 30 ఏండ్లు పైబడిన వారికి టీకా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో కోటి మార్క్కు వ్యాక్సినేషన్ చేరుకుంటుందన్నారు. జులై నెలలో 21 లక్షల డోసులు రానున్నాయి. టీచర్లు ఐడీ కార్డు చూపించి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. రాష్ర్టంలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వెలుగు చూడలేదని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.