Covid-19 | న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదుకాగా, ఐదుగురు మృతిచెందినట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో నలుగురు మరణించగా, ఉత్తరప్రదేశ్లో ఒకరు మృత్యువాతపడినట్టు తెలిపింది.
కేరళలో కొత్త వేరియంట్ జేఎన్.1 బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ర్టాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళలో కొత్త వేరియంట్ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం కర్ణాటక ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 60 ఏండ్ల పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది.
రాష్ర్టాలు, యూటీలకు కేంద్రం లేఖ
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలు, యూటీలకు సోమవారం లేఖ రాసింది. కేసుల పెరుగుదల, జేఎన్.1 వేరియంట్ గుర్తించిన నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని సూచించింది. అన్ని జిల్లాల్లో తగిన స్థాయిలో కొవిడ్ పరీక్షలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాల్సిన అవసరం ఉన్నదని, అదేవిధంగా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించేందుకు పాజిటివ్ శాంపిళ్లను సంబంధిత ల్యాబ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని సూచించింది.
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యల వల్లే కరోనా వ్యాప్తిని కట్టడి చేశామని, అయితే కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్నదని, ఈ మహమ్మారి ప్రవర్తన భారత వాతావరణ పరిస్థితులు, ఇతర సాధారణ వ్యాధి కారకాలతో స్థిరత్వం పొందిందని ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పంత్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కేరళ తదితర రాష్ర్టాల్లో కేసులు స్వల్పంగా పెరుగుతుండటాన్ని ప్రస్తావించారు.
రాబోవు పండుగ సీజన్ నేపథ్యంలో వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్ఫ్లూయెంజా వంటి కేసులను పర్యవేక్షించాలని, జిల్లాల వారీగా నివేదించాలని సూచించారు. తద్వారా కేసుల పెరుగుదల ట్రెండ్ను ముందే గుర్తించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కొత్త వేరియంట్ నుంచి వ్యాక్సిన్ల రక్షణ
జేఎన్.1 ఇన్ఫెక్షన్ ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందా అనే దానిపై స్పష్టత లేదని కేంద్రం పేర్కొన్నది. జేఎన్.1 తీవ్రత పెరిగే సూచన కూడా లేదని, ప్రస్తుతానికి ఉన్న ఇతర వేరియంట్లతో పోలిస్తే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. కొవిడ్-19 సోకిన వారికి ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంటే జేఎన్.1కు కూడా సమర్థంగా పనిచేస్తుందని, అప్డేటెడ్ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నది.
లాక్డౌన్ దిశగా సింగపూర్?
సింగపూర్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ దేశం మరోసారి లాక్డౌన్ దిశగా సాగుతున్నది. డిసెంబర్ 3-9 మధ్య వారం వ్యవధిలో ఏకంగా 56,043 కొత్త కేసులు నమోదు కాగా, ఈ సంఖ్య అంతకుముందు వారం 32,035గా ఉన్నది. దీంతో ఆ దేశ ఆరోగ్య శాఖ అడ్వైజరీని అప్డేట్ చేసింది. తాజా అడ్వైజరీ ప్రకారం ప్రజలు అనారోగ్యంగా లేకున్నా బహిరంగ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది.
కేసుల పెరుగుదల నేపథ్యంలో సింగపూర్ ఎక్సో హాల్లో రెండో కొవిడ్ చికిత్స కేంద్రాన్ని కూడా ఆరోగ్య శాఖ తెరువున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మలేషియాలో భారీగా కొవిడ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. డిసెంబర్ 10-16 మధ్య 20,696 కేసులు నమోదయ్యాయి. ముందస్తు చర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్న ఆరోగ్య మంత్రి అహ్మద్..లాక్డౌన్ విధించనున్నదని వార్తలను ఖండించారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా కేరళలో జేఎన్.1 వేరియంట్ వెలుగుచూసిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలు అవసరమైన మేరకు మాసులను ధరించాలన్నారు. కొవిడ్ను ఎదురొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని, వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.