హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్లో ( Narsingi Police Station ) కరోనా మహమ్మారి కలకలం చెలరేగింది. ఆ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 20 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో కరోనా సోకిన పోలీసులు అందరూ ఇప్పుడు హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. కరోనా కేసుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫిర్యాదుదారుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లోకి ఎవ్వరినీ అనుమతించడంలేదు. ఫిర్యాదు దారుల కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేశారు. ఆ టెంటు కిందనే వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ముఖాలకు మాస్క్ ధరించని వారిని టెంటు కిందకు కూడా రానివ్వడంలేదు. మాస్కులు ధరించిన వచ్చిన వారు కూడా సామాజిక దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు.