అల్లాదుర్గం, ఫిబ్రవరి14 : మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో దంపతులను స్తంభానికి కట్టేసి చితకబాదిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గంలో సోమవారం చోటుచేసుకున్నది. ఎస్సై మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని కిష్టయ్య నెలరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. పలు దవాఖానాల్లో చికిత్స చేయించినా ఆరోగ్యం కుదుటపడలేదు. అయితే, కిష్టయ్య బంధువులైన బోయిని రమేశ్, అతడి భార్య రజితకు బాణామతి చేయడం వస్తుందని, వారి వల్లే కిష్టయ్య అనారోగ్యం పాలయ్యాడని కుటుంబ సభ్యులు భావించారు. రమేశ్తో గొడవపడి ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి అక్కడే ఉన్న విద్యుత్తు స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన రమేశ్ వదిన సుజాతను కూడా కొట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను విడిపించారు. దాడి చేసిన బోయిని కుమార్, నగేశ్, బేతయ్య, ఆశమ్మ, అంబమ్మపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై తెలిపారు.