ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి
జలయజ్ఞం పేరిట ధనయజ్ఞానానికి పాల్పడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
( Puvvada Ajay Kumar ) ఆరోపించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట దోపిడీ చేసి ప్రాజెక్టులను అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మార్చారని విమర్శించారు. ఆయన హయాంలో అవినీతి, దోపిడీకి గురై కూనరిల్లిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు కేసీఆర్ ( KCR ) సీతారామ ప్రాజెక్టుగా పునర్జీవం పోసి ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు.
కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి గోదావరి జలాలను ఒడిసిపట్టి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టిందని తెలిపారు. ఇందు కోసం రూ.9 వేల కోట్లు వెచ్చించి, 100 కిలోమీటర్లకు పైగా ప్రధాన కాలువలు, పంప్ హౌస్లు, పైప్లైన్లు, ట్రాన్స్మిషన్ వ్యవస్థలను నిర్మించారని గుర్తు చేశారు. అధిక సామర్థ్యం గల మోటార్లు, ఆధునిక యాంత్రిక పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామని వెల్లడించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగానికి సాగర్ ఆయకట్టుకు శాశ్వత సాగునీటి భరోసా కల్పించ డం, వ్యవసాయాభివృద్ధి, భూగర్భ జలాల పెంపు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును రూపుదిద్దారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సీతారామ ప్రాజెక్టుకు చేసిన పని ఏమీ లేక , చెప్పుకునే విషయాలు లేక కేసీఆర్, బీఆర్ఎస్పై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.