హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరుగుతున్నవారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 11 వరకు 62,711 కేసులు నమోదు చేసినట్టు డీజీపీ కార్యాలయం బుధవారం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 16,569 కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనూ మాస్కు నిబంధన పక్కాగా అమలయ్యేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కూడా బ్లూకోల్ట్స్, ప్రెటోకార్ సిబ్బంది వెళ్లి కేసు నమోదు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరికీ ఎపిడమిక్ యాక్ట్ కింద రూ.1000 జరిమానా విధిస్తున్నారు. వీరు కోర్టుకు హాజరై జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
సంగారెడ్డి, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో 123 మందికి కరోనా వచ్చింది. ఇందులో 107 మంది బీటెక్, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, ఏడుగురు బోధన, తొమ్మిది మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. 107 మంది విద్యార్థులకు లక్షణాలు స్వల్పంగా ఉండటంతో హాస్టల్ బ్లాక్ను హోం ఐసొలేషన్ కేంద్రంగా మార్చి చికిత్స అందిస్తున్నారు. క్యాంపస్లోని దవాఖానలో ఉన్న ఏడుగురు వైద్యులు, 10 మంది సిబ్బంది కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం క్యాంపస్లో 1,400 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు స్వస్థలాలకు పయనం అవుతున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేవాలయాల్లో కొవిడ్ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ కార్యదర్శి అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పండుగల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్నందున మాస్కు, భౌతికదూరం, శానిటేషన్ వంటి నిబంధనల ప్రకారం భక్తులను ఆలయాల్లోకి అనుమతించాలని సూచించారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులు సైతం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని స్పష్టంచేశారు. ఆలయాలను మూసివేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. ముక్కోటి ఏకాదశిసహా ఆలయాల్లో ప్రవేశాలపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు.
ఏపీలోని కృష్ణపట్నంలో కరోనా మందు తయారుచేసి ప్రజలకు ఉచితంగా అందజేస్తున్న ఆనందయ్యపై ఆ రాష్ట్ర ఆయుష్శాఖ సీరియస్ అయింది. ఒమిక్రాన్కు మందు పంపిణీ చేయడంపై ఆనందయ్యకు నోటీసులిచ్చింది. మందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఆనందయ్య పం పిణీ చేస్తున్న మందుకు అనుమతిలేదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. అనుమతిలేకుండా పంపి ణీ చేయటంపై నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.