హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 చికిత్సకు కాక్టెయిల్ (మోనోక్లోనల్ యాంటిబాడీస్) దివ్యౌషధమని తేటతెల్లమైంది. ఒక్క ఇంజెక్షన్తో మహమ్మారి నుంచి రక్షణ పొందవచ్చని తేలింది. ప్రపంచంలోనే తొలిసారి మోనోక్లోనల్ యాంటిబాడీస్ సామర్థ్యంపై ఏఐజీ హాస్పిటల్స్, సీసీఎంబీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. ఆ వివరాలు సోమవారం ప్రతిష్ఠాత్మక జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురితమైనాయి.
అధ్యయన ఫలితాలను ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్రెడ్డి, ఏహెచ్ఎఫ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎం శశికళ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు డాక్టర్ అర్చన భరద్వాజ్ శివ, డాక్టర్ కార్తీక్ భరద్వాజ్, దివ్యతేజ్ సౌపాటి మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కొవిడ్ చికిత్సలో మోనోక్లోనల్ యాంటిబాడీస్ గేమ్ చేంజర్ అని నాగేశ్వర్రెడ్డి అన్నారు. కరోనా నిర్ధారణ అయిన 3-7 రోజుల్లో ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వంద శాతం సానుకూల ఫలితాలు వస్తున్నట్టు తెలిపారు. మోనోక్లోనల్ యాంటిబాడీస్ ఇంజెక్షన్ భవిష్యత్తులో కరోనా మరణాలకు ముగింపు పలుకుతుందని నాగేశ్వర్రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.
అధ్యయనం జరిగిందిలా..
285 మంది హై రిస్క్ కరోనా పేషెంట్లను ఫీవర్ క్లినిక్ నుంచి ఎంపికచేశారు. వీరిలో 60 ఏండ్లు పైబడినవారు, 60 ఏండ్ల లోపు ఉన్న డయాబెటిస్, హైపర్టెన్షన్, ఒబేసిటీ రోగులు, గర్భిణులు ఉన్నారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి మొదటి గ్రూప్ వారికి మోనోక్లోనల్ థెరపీ, రెండో గ్రూపువారికి రెమ్డెసివిర్ ఇచ్చి స్టాండర్డ్ ఆఫ్ కేర్ చికిత్స అందించారు. మోనోక్లోనల్ తీసుకున్న వారందరూ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రెండో వేవ్కు కారణమైన డెల్టా వేరియంట్పై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది.
మూడో వేవ్కు కారణమవుతుందని భావిస్తున్న డెల్టా ఏవై 4.2 కూడా డెల్టా రకానికి చెందినదే కావడంతో కాక్టెయిల్ డ్రగ్ దానిపైనా పనిచేస్తుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనేందుకు మోనోక్లోనల్ యాంటిబాడీస్ను ల్యాబ్లో అభివృద్ధి చేస్తారు. కాసిరివిమాబ్, ఇమ్డేవిమాబ్ అనే రెండు మందులు ఇందులో ఉంటాయి. రోగికి 1,200 ఎంజీ ఇంజెక్షన్ ఇస్తారు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, మూడు నెలల దాకా దీని ప్రభావం పని చేస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి.