పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్ని సినిమాల్లో నటిస్తున్నాడు అనేది ఆయన అభిమానులకు కూడా క్లారిటీ లేదు. మరోవైపు ఆయనతో సినిమాలు కమిట్ అయిన నిర్మాతలు కూడా కంగారు పడుతున్నారు. ఎప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇస్తాడు.. ఏ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడు అనేది క్లారిటీ రావడం లేదు. అయినా కూడా ఒప్పుకున్న సినిమాలను వేగంగా పూర్తి చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు పవర్ స్టార్. అందుకే కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.
పగలు క్రిష్.. సాయంత్రం సాగర్ కే చంద్ర సినిమా లొకేషన్ లో ఉంటున్నాడు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉంటే మార్చి 11 మహా శివరాత్రి కానుకగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్లు క్రిష్ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు చిన్న టీజర్ కూడా విడుదల చేయనున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో సీనియర్ నిర్మాత ఏ.ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ సగం పూర్తయింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన చార్మినార్ సెట్ ని నిర్మించారు. అందులో పాతబస్తీలో ఉండే వస్తాద్ లను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తో ఫైట్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించాడు దర్శకుడు.
ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
కోహినూరు వజ్రం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రానికి హరహర వీరమల్లు అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి కథతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి 2022 సినిమా విడుదల అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు నిర్మాతలు. ఇదిలా ఉంటే మార్చి 11 కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటి నుంచి వేచి చూడటం మొదలుపెట్టారు. సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందనే దానికంటే టీజర్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తి పెంచేస్తుంది.