ఖైరతాబాద్, అక్టోబర్ 16: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్రులంతా బీఆర్ఎస్ వెన్నంటే ఉంటారని తెలంగాణ సీమాంధ్రుల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో సంఘం కన్వీనర్ ఆర్ఆర్ రెడ్డి మాట్లాడారు. త్వరలో నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ ఎన్నికల్లో సీమాంధ్రులంతా బీఆర్ఎస్కే ఓట్లు వేసేలా చొరవ తీసుకుంటామని చెప్పారు. సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు కుల, మత, వర్గాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీకి బాసటగా నిలబడాలని పిలుపునిచ్చారు.
2014లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే నాటికి తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో సుమారు 50 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తూ ఉన్నారని వివరించారు. సీఎంగా కేసీఆర్ తమ సంక్షేమానికి అనేక విధాలుగా కృషి చేశారని చెప్పారు.
సీమాంధ్రులను ఎప్పుడూ వేరుగా చూడలేదని, ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలో తమకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. 2018 ఎన్నికల్లో సీమాంధ్రులు బీఆర్ఎస్ పార్టీకే మద్దతు పలికినట్టు తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు జీఎన్ సత్యనారాయణ, పీ కామయ్య, అమూల్యారెడ్డి, బాలకృష్ణ, జీవీ నాయుడు, సతీశ్యాదవ్, ఇస్మాయిల్, మల్లికార్జునరావు, జాన్ కెన్నడీ, జెమినీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.