హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్షల్లో రోజుకో వివాదం వెలుగుచూస్తున్నది. తాజాగా అధికారులు, పరీక్షల నిర్వహణాధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఓ పరీక్షాకేంద్రంలోని విద్యార్థులకు గణితం గ్రాఫ్ పేపర్లు అందలేదు. చివరికి మెయిన్ ఆన్సర్షీట్లోనే గ్రాఫ్ వేయించి చేతులు దులుపుకొన్నారు.
శనివారం పదోతరగతి గణితం పేపర్ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలోని రేడియంట్ స్కూల్ పరీక్షకేంద్రంలోని విద్యార్థులకు గ్రాఫ్ పేపర్ అందలేదు. ఎస్సెస్సీబోర్డు నుంచి గ్రాఫ్ పేపర్ రాకపోగా, పరీక్షాకేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు (సీఎస్డీవో) ఈ విషయాన్ని చూసుకోలేదు. విద్యార్థులు గ్రాఫ్ పేపర్ కావాలని అడగ్గా, ఎస్సెస్సీబోర్డు పంపించిన మెటీరియల్లో వెతకగా గ్రాఫ్పేపర్లు లేకపోవడంతో కొంతసేపు గందగోళం నెలకొన్నది.
దీంతో అప్పటికప్పుడు మెయిన్ ఆన్సర్షీట్స్లోనే గ్రాఫ్ వేయించారు. ఇందుకు ఇద్దరు సీఎస్డీవోలదే బాధ్యత అని తేల్చిన అధికారులు వారిని పరీక్ష విధుల నుంచి తప్పించారు. వీరి స్థానంలో మరో ఇద్దరు టీచర్లకు బాధ్యతలు అప్పజెప్పారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఓ పరీక్షాకేంద్రానికి కేటాయించిన కస్టోడియన్ మరో పరీక్షాకేంద్రంలో అదనపు ఆన్సర్షీట్స్ కోసం వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా మరో సెంటర్కు వెళ్లడాన్ని సీరియస్గా పరిగణించి విధుల నుంచి తప్పించారు.
ఇదే జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారికి కూడా విధుల నుంచి తొలగించారు. శనివారం గణితం పరీక్షకు 4,95,293 మంది విద్యార్థులకుగాను 4,93, 652 (99.67శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ప్రైవేట్ విద్యార్థుల్లో 6,096 మందికి, 5,301 (87.35శాతం) మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు అధికారులు వెల్లడించారు.