హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ అధ్యాపకులకు త్వరలోనే తీపికబురు అందిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. జూనియర్, డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ ముమ్మర కసరత్తు చేస్తున్నదని వెల్లడించారు. శనివారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్హౌస్లో జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు వీలుగా సీఎం కేసీఆర్ సర్కారు 2016 ఫిబ్రవరి 26న జీవో16ను జారీచేసిందని గుర్తుచేశారు. కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశం కొలికిరాలేదని అన్నారు. ఇటీవలే కోర్టు కేసు కొట్టివేతతో కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసిందని గుర్తుచేశారు. కింది కోర్టులో కేసు ఓడిన వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, అయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం దశలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నదని చెప్పారు. సమావేశంలో లెక్చరర్స్ సంఘాల నాయకులు రామకృష్ణగౌడ్, జంగయ్య, రమణారెడ్డి, సురేశ్, శ్రీనివాస్, వైకుంఠం, శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.