హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మంది మత్స్యకారులకు నిరంతరం శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొంటున్నట్టు మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు. రూ.12 కోట్ల వ్యయంతో మేడ్చల్లో చేపట్టిన మత్స్యకారుల శిక్షణ కేంద్రం నిర్మాణ పనులు తుది దశకు చేరుకొన్నాయని తెలిపారు. శుక్రవారం ఆయన భవన నిర్మాణ పనులతోపాటు వసతి గృహాన్ని పరిశీలించారు. రవీందర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మత్స్యరంగంలో అందుబాటులోకి వస్తున్న అక్వాకల్చర్ ఆధునిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు.
చేపల ప్రాసెసింగ్, వ్యాల్యూ ఆడిషన్ , చేపల ఆహార పదార్థాలు తయారుచేయడంతోపాటు చేపల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నట్టు తెలిపారు. తెలంగాణలో మత్స్యకార కుటుంబాల ఆదాయాలను పెంపొందించి, వారి కుటుంబ సంక్షేమానికి పాటుపడతామని చెప్పారు. రవీందర్ వెంట జీఎం శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా మత్స్యశాఖాధికారి పూర్ణిమ తదితరులున్నారు.