హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): వచ్చే వేసవి కాలంలో ఎటువంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలుకంటున్న సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్తు సరఫరా గత సంవత్సరంతో పోల్చితే 2023 డిసెంబర్ 7 నుంచి గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. గత నెలలో ప్రతిరోజూ సగటున 207.7 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా చేశామని వెల్లడించారు. 2022 డిసెంబర్లో సగటున 200 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశారని వివరించారు. ఈ ఏడాది మొదటి 28 రోజులు ప్రతిరోజూ సగటున 242.43 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగిందని తెలిపారు. ఇది గత ఏడాది 226 మిలియన్ యూనిట్లు మాత్రమే అని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు విద్యుత్తు డిమాండ్ను తీర్చడానికి తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తుగా మెయింటెనెన్స్ పనులు కూడా చేపట్టామని తెలిపారు. విద్యుత్తు సరఫరా విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.