హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఫీజుల నియంత్రణ చట్టం రూపకల్పన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు శుక్రవారం ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు. ఎర్రమంజిల్లోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, డైరెక్టర్ శ్రీదేవసేన, అడిషనల్ డైరెక్టర్ లింగయ్యలతో కూడిన కమిటీ పలు సంఘాలతో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు సంఘాల నేతలు చట్టంపై తమ అభిప్రాయాలను కమిటీకి సమర్పించారు. కరోనాతో విద్యాసంస్థలు మూతపడినందున ప్రతిఏటా 10 శాతం చొప్పున మూడేండ్లకు 30 శాతం ఫీజులు పెంచుకునేందుకు అనుమతించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేమెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ప్రభుత్వాన్ని కోరింది. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చినా రెండేండ్ల తర్వాతే అమలుచేయాలని ప్రతిపాదించింది. సమావేశంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, ఐవీ రమణారావు, డాక్టర్ ప్రసాద్రావు, పరంజ్యోతి, పీ రమణారావు, ఏ శ్రీకాంత్రెడ్డి, ట్రస్మా (పాపిరెడ్డి వర్గం) నేతలు కందాల పాపిరెడ్డి, ఎస్ఎన్రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇతర యాజమాన్య సంఘాల నుంచి కూడా పాల్గొన్నారు.