హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పీఎంజీఎస్వై రోడ్ల పనులు అత్యంత వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయి. ఎక్కడా రాజీ లేకుండా పనులు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
పీఎంజీఎస్వై (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన) రోడ్ల పనులపై కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి గిరిరాజ్ సింగ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఢిల్లీ నుంచి సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి మంత్రి ఎర్రబెల్లి, సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పీ ఎంజీఎస్వై పనులు రాష్ట్రంలో అత్యంత వేగంగా నాణ్యతతో పూర్తవుతున్నాయని తెలిపారు.
ఆయా పనులను ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులు పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. నిర్ణీత గడువులోగా ఆయా పనులు పూర్తి చేస్తామని మంత్రి కేంద్రానికి తెలిపారు. అలాగే స్టేట్ షేర్, సెంట్రల్ షేర్, మెయింటనెన్స్ నిధులు వేగంగా అందేట్లు సీఎం కేసీఆర్తో మాట్లాడతామని మంత్రి హామీ ఇచ్చారు.