కరీంనగర్ : కరీంనగరాన్ని సుందరంగా, పర్యాటకంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం దిగువ మానేరు డ్యాం గేట్ల కింది భాగంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం పనుల ప్రారంభం కోసం రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ అధికారులు, టూరిజం అధికారులు, కలెక్టర్తో కలిసి స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరీంనగరాన్ని సుందర నగరంగా, పర్యాటకంగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కరీంనగర్ కు ముఖ ద్వారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
ముందుగా కరీంనగర్- వరంగల్ పాత రోడ్డులో తీగల వంతెనను నిర్మిస్తున్నామని, దీనిపై డైనమిక్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వంతెనను ఈ ఏడాది మే నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.
రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ను మొదటి దశలో 3.75 కి.మీ వరకు పూర్తి చేస్తామని, రెండో దశలో 6.25 కి.మీలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఐ.ఎన్.ఎస్. కన్సల్టెన్సీ మానేర్ రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తుందని మంత్రి వివరించారు.
మానేరు రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్, ఆట స్థలాలు, గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తామని అన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున టెండర్లు పిలిచి, టెండర్లు ఖరారైన తర్వాత ముఖ్యమంత్రితో పూజలు నిర్వహించి మానేర్ రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.
మానేర్ రివర్ ఫ్రంట్ లో 12 నుంచి 13 ఫీట్ల లోతు వరకు నీరు నిల్వ ఉంటుందని, ఇందులో స్పీడ్ బోట్లు, క్రోజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా, ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అన్నారు.
రజత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణంగా మానేరు రివర్ ఫ్రంట్ నిలుస్తుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు మానేర్ రివర్ ఫ్రంట్ ముఖద్వారంగా ఉంటుందని, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 147 టి.ఎం.సిల నీరు ప్రాజెక్టులో ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం మానేర్ రివర్ ఫ్రంట్ డిజైన్ చేసిన పోస్టర్లను మంత్రి గంగుల కమలాకర్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు.
ముందుగా ఉదయం ఎల్.ఎం.డి. కంట్రోల్ రూం మీటింగ్ హాల్ లో మానేరు రివర్ ఫ్రంట్ డిజైన్ పై మంత్రి గంగుల కమలాకర్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అధికారులు మురళీధర్, శంకర్, వెంకటేశ్వర్లు, టూరిజం ఎం.డి మనోహర్ రావు, ఈ.డి. శంకర్ రెడ్డి, తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, నీటి పారుదల శాఖ క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకట కృష్ణ, ఎస్.ఈ. శివ కుమార్, దేవెందర్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్ రావు, ఆర్డీఓ ఆనంద్ కుమార్, కరీంనగర్, తిమ్మాపూర్ తహశిల్దార్లు సుధాకర్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.