నూతన పాలనాసౌధం తెలంగాణ రాజసాన్ని ప్రతిబింబిస్తున్నది. నిబిడాశ్చర్యంతో, ఉప్పొంగిన గర్వంతో దాని వైపు చూసి కన్నుల్లో ఆనందాన్ని నింపుకొంటున్న వారెందరో. ఆ శ్వేతసౌధానికి రాళ్లెత్తిన వివిధ రాష్ర్టాల కూలీలు మాత్రం.. ఈ అద్భుతాన్ని తామే సృష్టించామా అని ఆశ్చర్యపోతున్నారు. చూసినవాళ్లు అబ్బుర పడటం సాధారణం. కానీ, అది చేసినవాళ్లూ అద్భుతం అనడం వేరు. ‘కట్టేటప్పుడు అనుకోలేదు. ఇంత గొప్ప సౌధం మా చేతుల మీదుగా వెలుస్తుందని కలలోనైనా ఊహించలేదు..’ అంటూ వారు పులకించిపోతున్నారు.
జాబ్ శాటిస్ఫాక్షన్ ఉంటే జేబు శాటిస్ఫాక్షన్ ఉండదు. రెంటిలో ఏదో ఒకటే సాధారణంగా ఉంటుంది. కానీ రెండూ దొరికే అవకాశం అరుదుగా, అది కూడా కొందరికే దక్కుతుంది. ఇప్పుడలాంటి అనుభూతికి లోనవుతున్నారు తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులు, ఇంజినీర్లు, కూలీలు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో ఎవరికీ తెలీదు. మహా అయితే వారికి ఉపాధి దొరికి ఉండవచ్చు. కానీ సచివాలయ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలకు ఉపాధితోపాటు ఆత్మసంతృప్తి కూడా దక్కుతున్నది. వారి జీవితాలు ధన్యమయ్యాయి. చరిత్రలో వారి శ్రమ సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంటుంది. ఈ మాటలు ఎవరో చెప్తున్నవి కావు.. స్వయంగా వారి మనుసుల్లోంచి వచ్చినవి.
శుక్రవారం నూతన సచివాలయ భవనాన్ని పరిశీలిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ టీ రవీందర్రావు, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ తదితరులు
Secretariat | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఆధునిక వసతులతో.. హంగులతో.. రాజధాని నడిబొడ్డున.. హుస్సేన్సాగర్ తీరాన విశాల ప్రాంగణంలో నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబ్కేదర్ తెలంగాణ సచివాలయం యావత్ రాష్ర్టానికే తలమానికంగా నిలుస్తున్నది. దీర్ఘ చతురస్రాకారంలో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ ప్లస్ 5 అంటే 6 అంతస్థుల్లో.. అత్యుత్తమ దక్షిణభారత సంప్రదాయంలో, దక్కన్ కాకతీయ శైలిలో, మనోహరమైన రీతిలో, భారీ డోములతో రూపుదిద్దుకున్న శ్వేతసౌధం తెలంగాణ ప్రాభవానికి ప్రతీకగా నిలుస్తున్నది. అత్యంత సుందరంగా వెలసిన ఈ భవనాన్ని చూస్తూ నిర్మాణ పనుల్లో భాగస్వాములైన కార్మికులు సైతం మురిసిపోతున్నారు.
తమ రెక్కలకష్టంపై ఆవిష్కృతమైన అద్భుతానికి సకల జనుల నుంచి ప్రశంసలు కురుస్తుండటంతో ఉప్పొంగిపోతున్నారు. నిర్మాణం తెలంగాణ ప్రాభవానికే కాదు.. తమ నిర్మాణ నైపుణ్యాలకూ ప్రతీకని అభివర్ణించుకుంటున్నారు. మహత్తర నిర్మాణంలో భాగస్వాములవడం గర్వకారణమని సంబురపడుతున్నారు. ప్రారంభానికి సిద్ధమైన వేళ శ్వేతసౌధాన్ని చూస్తూ ఏళ్ల శ్రమను మరచిపోయి పండుగలా మురిసిపోతున్నారు. అంతేకాదు మళ్లీ ఇలాంటి నిర్మాణంలో పాలుపంచుకునే మహదావకాశం దక్కుతుందనేది కలేనని తెలుపుతున్నారు. ఇప్పటివరకు ఎన్ని నిర్మాణాలు చేపట్టినా ఉపాధి లభించిందే తప్ప ఇంతటి ఆత్మసంతృప్తి పొందలేదని ఆనంద పరవశులవుతున్నారు. ఈ చారిత్రక కట్టడంలో పలు రాష్ర్టాల నిపుణుల భాగస్వామ్యం ఉన్నది. గ్రానైట్ పనికి రాజస్థాన్ వర్కర్లు, గ్లాస్ వర్క్కు యూపీ కార్మికులు, జార్ఖండ్, బీహార్, ఒడిశా నుంచి వచ్చిన వారు సివిల్ పనుల్లో పాలుపంచుకున్నారు.
సచివాలయ భవన ప్రధాన ద్వారం
నూతన సెక్రటేరియట్లో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన మంత్రి లాంజ్
అత్యాధునిక వసతులు, హంగులతో ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం
సచివాలయంలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్
సచివాలయంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు
భవనం మొదలు పెట్టినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్న. మొదట అన్ని పెద్ద పెద్ద భవంతుల్లాగే ఇది కూడా ఒకటి అనుకున్న. తరువాత ఫొటోలు చూసినంక తెలిసింది. మేమేనా ఇది కట్టిందని అనిపిస్తున్నది ఇప్పుడు. ఇలాంటి భవనాన్ని నా జీవితంలో ఎక్కడా, ఎప్పుడూ చూడలేదు. ఎంతో సంతోషంగా ఉన్నది. – సుహబొద్, బెంగాల్
15ఏండ్లుగా ఇంజినీరింగ్ వృత్తిలో కొనసాగుతున్నాను. పెద్ద పెద్ద అంతస్థులతో ఎన్నో బిల్డింగులను నిర్మించడంలో పాల్గొన్నా. కానీ ఈ సచిలవాయం నిర్మాణంలో పాలుపంచుకోవటం చాలా గర్వంగా ఉన్నది. మా ఇంజినీరింగ్ సిబ్బంది కాకుండా ప్రతి రోజు షిఫ్టుకు 2500 మంది ఈ భవనం కోసం శ్రమించారు. మొత్తంగా 12 వేల మందికిపైగా భాగస్వాములయ్యారు. భవనాన్ని చూస్తూ ప్రతి ఒక్కరూ పొగుడుతుండటం, మెచ్చుకోవటం ఎంతో ఆనందాన్నిస్తున్నది. ఇప్పటివరకు ఎన్ని నిర్మాణాలు చేపట్టినా ఇంతటి ఆత్మసంతృప్తి ఎప్పుడూ కలగలేదు. నా కెరీర్లో ఇదో మైలురాయిగా, జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
– రఘువీర్, సీనియర్ ఇంజినీర్, బీహార్
అర్కిటెక్చర్ అద్భుతం. 6 నెలలుగా ఇదే బిల్డింగ్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాం. ప్రతి రోజూ ఏదో ఒక అంశాన్ని తెలుసుకుంటూ ఆశ్చర్యపోతున్నాం. ప్రధాన అంశాలను నోట్ చేసుకోవడానికే 4 పుస్తకాలు నిండిపోయాయంటే అర్థం చేసుకోండి. ఇందులో ఇంటర్న్షిప్ చేయడం జీవితంలో మధురజ్ఞాపకంగా నిలిచిపోతుంది. – బషీర్ అహ్మద్, జేఎన్టీయూ ఫైన్ ఆర్స్ స్టూడెంట్
గ్రానైట్ వర్క్ చేసేందుకు వచ్చాం. ఇప్పటివరకు ఎన్నో భవనాలకు పనిచేశా. ఆదాయం వస్తుండేది. అక్కడి వరకే. ఎప్పుడూ ఇంత గొప్ప గా అనిపించలేదు. కానీ జీవితంలో మొదటిసారిగా ఆదాయంతోపాటు ఆత్మసంతృప్తిని ఇచ్చిన నిర్మాణం ఈ భవనం ఒక్కటే. రాజభవనాన్ని చూసినట్టునే ఉన్నది.
– రాకేశ్కుమార్ (రాజస్థాన్)
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్ను తలపించే రీతిలో నూతన సచివాలయం రూపుదిద్దుకున్నది. అబ్బురపరిచే హంగులు, అత్యాధునిక వసతులతో తెలంగాణ ఆత్మగౌరవానికి నిర్మించిన గొప్ప కట్టడం. వాటర్ ఫౌంటెయిన్తోపాటు పూల మొక్కలు, పండ్ల మొక్కలు, గార్డెనింగ్తో ప్రాంగణమంతా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా ఉన్నది.
– మహబూబ్, కాంట్రాక్టర్, వరంగల్
తెలంగాణ సచివాలయం భవనానికి అద్దాలు బిగించేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి 50 మంది కార్మికులం హైదరాబాద్ వచ్చాం. అద్దాలు బిగించిన తరువాత చూస్తే మరింత అందంగా ఉన్నది. అందరూ భవనం గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే సంతోషంగా, గర్వంగా ఉన్నది. జీవితంలో ఇలాంటి అదృష్టం రాదేమో.
– అమరేందర్సింగ్, యూపీ