హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నేడు కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. మొత్తం 1,601 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పోలీస్శాఖలోని మొత్తం 15,644 కానిస్టేబుల్, రవాణాశాఖలోని 63, ఎక్సైజ్శాఖలోని 614 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షకు కలిపి 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది.
పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను గుర్తించేందుకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటారని, పరీక్ష సమయానికి గంట ముందే (ఉదయం 9 గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. చేతులకు గోరింటాకు, మేహందీ వంటివి పెట్టుకుంటే బయోమెట్రిక్లో వేలిముద్రలు గుర్తించే అవకాశం ఉండదని తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేదిలేదన్నారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి లేదని తెలిపారు.