హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి పార్టీలకతీతంగా నేతలు మద్దతు పలికారు. సీఎం దళిత్ సాధికారత పథకాన్ని కాంగ్రెస్సహా అన్నిపార్టీలు సమిష్టిగా సమర్థించాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను అన్ని పార్టీల నేతలు అభినందనలతో ముంచెత్తారు. ఒక మంచి పథకాన్ని తీసుకువచ్చారని.. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం రాత్రి 10 గంటలదాకా 11 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. దళితుల అభ్యున్నతిపై సమగ్రంగా చర్చించారు. దళిత సాధికారత పథకం కింద అత్యంత నిరుపేదలైన దళితులను ఎంపికచేసి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ఒకే అంశంపై ఇంత సుదీర్ఘమైన చర్చ ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ జరుగలేదు. సాధారణంగా అఖిలపక్ష సమావేశాలు గంట, రెండు గంటల కంటే ఎక్కువ జరిగిన దాఖలాలు లేవని ఇందులో పాల్గొన్న నేతలు వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ నేతలు, దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మేధావులు ఈ భేటీలో పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలో అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందించాలంటూ సమావేశంలో పాల్గొన్న ప్రతిఒక్కరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో దళితుల వెనుకబాటుతనం, అందుకు గల చారిత్రక కారణాలను సమావేశం చర్చించింది. కులరహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ నాంది పలకడం ఖాయమని, అటువంటి చారిత్రాత్మక కార్యాచరణ కేవలం సీఎం కేసీఆర్ తో మాత్రమే సాధ్యమని నేతలు ప్రకటించారు. ఈ తరహా సమావేశం జరగడం దేశంలో ఎక్కడా జరుగలేదని ప్రతిపక్ష నేతలు మీడియాతో చెప్పారు. సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని సమావేశం అన్ని పార్టీల నేతలు అభినందనలు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో టీఆర్ఎస్ దళిత ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.