కొలువుల ఏడాది 2023లో తొలి మూడునెలల్లోనే ఉద్యోగార్థుల ముందు 6 పరీక్షలు రానున్నాయి. ఈ ఆదివారం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 ఎగ్జామ్తో మొదలై మార్చి వరకు వరుస పరీక్షలు జరుగనున్నాయి. ఇటు ఉద్యోగార్థులు ప్రిపరేషన్లో నిమగ్నమవగా, అటు టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో బిజీగా ఉన్నది.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర సాగుతున్నది. 2022 నోటిఫికేషన్ల కోలాహలంతో ముగియగా, 2023 పరీక్షల నామ సంవత్సరంగా మిగిలిపోనున్నది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 3న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 23 ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష పూర్తయ్యింది. 8న ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్ వైజర్) గ్రేడ్-1 పరీక్ష, 22న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఫిబ్రవరి 12న అసిస్టెంట్ ఇంజినీర్, 26న డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్-2 పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 12న టీపీబీవో(టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్), 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. మూడు నెలల్లో 2,963 ఉద్యోగాలకు ఆరు పరీక్షలు జరుగనున్నాయి. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ 18,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఏప్రిల్లో గ్రూప్-1 మెయిన్స్
గత అక్టోబర్ 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వారం రోజుల్లో విడుదల చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఏప్రిల్లోనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నది. శుక్రవారం జరిగిన కమిషన్ సమావేశంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు తదితర అంశాలపై చర్చించింది. హార్టికల్చర్ ఆఫీసర్, గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులతోపాటు ఫిజికల్ డైరెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షలను కూడా ఏప్రిల్లో నిర్వహించే అంశంపై చర్చించారు. ఈ నెలలోనే గురుకులాల్లో 11,687 ఉద్యోగాల భర్తీకి ప్రకటన రానున్నది. ఇప్పటివరకు ఆర్థిక శాఖ 61,401 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ బోర్డు 43,099 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాయి.