నిజామాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సిర్పూర్(టీ)/పెద్దపల్లి, నవంబర్ 29: కాంగ్రెస్ నోట్ల ప్రవాహం సాగుతూనే ఉన్నది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజాస్వా మ్య విలువలకే తిలోదకాలిస్తున్నారు. తాజాగా, మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచరుడిగా పేరొందిన గూడెం శ్రీనివాస్రెడ్డి వద్ద రూ.56.84 లక్షల విలువైన 114 నోట్ల కట్టలు బయటపడ్డాయి.
కామారెడ్డిలోని జీవదాన్ స్కూల్ వద్ద ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్ అడ్డాగా అక్రమంగా ఓట్లు కొనేందుకు డబ్బు పంచుతున్నట్టు పలువురు గుర్తించారు. వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా దాడులు నిర్వహించారు. నోట్ల కట్టలు బయటపడటంతో అవాక్కైన అధికారులు వెంటనే ఆదాయపన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. రూ.500 విలువ గల 114 నోట్ల కట్టలు ఉన్నట్టు ఆదాయపన్ను శాఖ తేల్చింది. దీంతో ఈసీ ఆదేశాలతో కామారెడ్డి పోలీస్ స్టేషన్లో గూడెం శ్రీనివాస్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
డబ్బుపై తలా తోక లేని సమాధానాలు
డబ్బు ఎక్కడిది? ఇక్కడ ఎందుకు దాచారు? అని అధికారులు ప్రశ్నించగా, రేవంత్ అనుచరుడు తలా తోక లేని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఇంత పెద్దమొత్తంలో నోట్ల కట్టలను రియల్ ఎస్టేట్ కంపెనీలో దాచటానికి కారణాలు, ఆధారాలు ఏవని అడగ్గా తెల్లముఖం వేసినట్టు సమాచారం. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ డబ్బు తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ డబ్బు కామారెడ్డికి ఎలా చేరిందన్న కోణంలో ఐటీ అధికారులు వివరాలు రాబడుతున్నారు.
కొడంగల్ గ్యాంగ్ దగ్గరుండి డబ్బు పంపిణీ చేపట్టినట్టు తేలింది. కాగా, కర్ణాటక నుంచే కామారెడ్డికి ఈ డబ్బు చేరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. డబ్బుల కట్టలు దాచినందునే దేవీవిహార్లోనూ పోలీసులను చూసి కాంగ్రెస్ నేతలంతా ఎదురు దాడికి దిగి హల్చల్ చేశారని స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో గందరగోళ వాతావరణం ఏర్పడటంపై ప్రజలు మండిపడుతున్నారు.
పలు చోట్ల భారీగా నగదు పట్టివేత
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) లో వాహన తనిఖీల్లో భాగంగా బుధవారం పోలీసులు రూ.56.48 లక్షలు పట్టుకున్నారు. మండలకేంద్రానికి చెందిన షఫీఉల్లా బుధవారం కాగజ్నగర్ నుంచి సిర్పూర్(టీ)కు గూడ్స్లో నూనె కాటన్లు తరలిస్తున్నాడు. పోలీసులు తనిఖీ చేయగా నూనె కాటన్లలో ఆధారాలు లేని రూ.56.48 లక్షలు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకొని, ఆటో డ్రైవర్ షఫీ ఉల్లాతోపాటు తంగడిపల్లి సంతోశ్, ముసావీర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో దన్నమనేని ఆనందరావు ఇంటి లో అక్రమంగా నిల్వ చేసిన రూ.31.5 లక్షలను జప్తుచేశామని పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సీహెచ్ మధుమోహన్ తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం మధారిగూడేనికి చెందిన కాంగ్రెస్ నాయకుడి కారులో బుధవారం రాత్రి రూ.4.95 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. మధారిగూడెంలో ఓటర్లకు పంచేందుకు కాంగ్రెస్ నాయకుడు పోశం శ్రీనివాస్గౌడ్ తన కారులో తరలిస్తుండగా హాలియా ఎస్సై శోభన్బాబు పట్టుకున్నారు.
కారుతోపాటు డబ్బును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో ఓటర్లకు ఓటర్ స్లిప్పులతోపాటు నగదు పంచుతున్న కాంగ్రెస్ నాయకు లు తాటికాయల సంతోశ్, తాటికొండ మోహన్పై కేసు నమోదు చేసినట్టు సీఐ సట్ల రాజు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.15,500 నగదు, ఓటరు స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. రాజీవ్ రహదారిపై గజ్వేల్ నియో జకవర్గం వంటిమామిడి చెక్పోస్టు వద్ద పోలీసు లు కోటికి పైగా నగదును పట్టుకున్నారు.
పస్రాలో గోడ గడియారాలు, నగదు పంపిణీ
ములుగు నియోజకవర్గంలో సీతక్క గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులు గిఫ్ట్లు, అందులో డబ్బులు అమర్చి పంచే కార్యక్రమానికి తెరలేపారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో బుధవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గోడ గడియారం డబ్బాలో సీతక్క ఫొటోతోపాటు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ముద్రించిన మినీ పోస్టర్ అమర్చారు. గడియారం వెనుక సెల్ పెట్టే స్థానంలో రూ.3 వేల నగదు అమర్చడం స్థానికంగా కలకలం రేపింది. కాగా నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని 9వ వార్డులో బుధవారం రాత్రి 10 గంటలకు కాంగ్రెస్ నాయకులు డబ్బు, మద్యం పంచుతున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు వెంకటనర్సింహులు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకొని వారిని నిలదీశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. సీఐ జనార్దన్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.