హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నాయకత్వంలో అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి జడ్పీటీసీ సభ్యురాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సున్నం నాగమణి, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత కొండూరి సుధాకర్, ఇల్లెందు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు బండి సత్యనారాయణ బీఆర్ఎస్లో చేరారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, భద్రాచలం డివిజన్ సీనియర్ నేత రావులపాటి రాంప్రసాద్, వెంకటాపురం ఎంపీపీ సతీశ్, సీపీఐ మండల కార్యదర్శి సునీల్తోపాటు పలువురు సీపీఐ డివిజన్ నాయకులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటరావు విజయానికి కృషి చేయాలని కేటీఆర్ కోరారు.