హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తప్పుడు ప్రచారం, ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) విమర్శించారు. ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం సభ నిర్వహణ ఏర్పాట్లపై పర్యవేక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకే గ్యారెంటీ లేని పరిస్థితుల్లో.. ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. జీవో 58, 59 కింద నగరంలో వేలాదిమందికి ఇంటి స్థలాలను రెగ్యులరైజేషన్ చేశామని చెప్పారు. సొంత ఇల్లు లేని సుమారు 70 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేశామని వివరించారు. బహిరంగ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.
నగరంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఈ సభకు వస్తారని తెలిపారు. 24 ప్రాంతాలలో పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బెవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, కంటోన్మెంట్, నాంపల్లి నియోజకవర్గ అభ్యర్థులు లాస్య నందిత, ఆనంద్ గౌడ్, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.