హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలో భర్తీ చేయబోయే నాలుగు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు ఖరారు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్చార్జి దీపాదాసు మున్షీ, సీఎం రేవంత్రెడ్డి కలిసి శనివారమే కసరత్తు చేసి ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు నామినేటేడ్ పోస్టుల భర్తీ ఎంపిక ప్రక్రియ పూర్తిచేసినట్టు తెలిసింది. పార్టీ అధిష్ఠానం కూడా దీనికి ఆమోదముద్ర వేయడంతో అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.
ఎమ్మెల్యే కోటాలో ఒక బీసీ, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారుచేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి తిరిగి ఈ నెల 21న హైదరాబాద్ చేరుకుంటారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18 వరకే గడువు ఉండడంతో ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఫారాలను సీఎం ఇప్పటికే అందజేసినట్టు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
పరిశీలనలో పలువురు మైనార్టీ నేతల పేర్లు
గవర్నర్ కోటా కింద భర్తీ చేయబోయే రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ విద్యాసంస్థల అధిపతి జాఫర్జావేద్ను ఖరారు చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మైనార్టీ అభ్యర్థులు ఎవరూ గెలవకపోవడంతో ఎమ్మెల్సీల ఎంపికలో ఆ వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ భావిస్తున్నది.
అందులో భాగంగా ఏఐసీసీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫయీమ్ ఖురేషీ, మస్కతి డెయిరీఫామ్ యజమాని మస్కతి, ముఫకంజా విద్యాసంస్థల అధిపతి జాఫర్ జావేద్తో పాటు మాజీమంత్రి షబ్బీర్అలీ, ఫిరోజ్ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కని నేతలకు, టికెట్ ప్రకటించి చివరి నిమిషంలో రద్దు చేసిన డజనుమంది నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం.