హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మండిపడ్డారు. బీజేపీలో చేరిన రాజగోపాల్రెడ్డి.. ఇక జీవితంలో అసెంబ్లీ లో అడుగు పెట్టబోరని ఆ యన వ్యాఖ్యానించారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ గోవు లాంటిది, బీజేపీ పులి లాంటిదంటూ గతంలో రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని జీవన్రెడ్డి గుర్తుచేశారు. పాలిచ్చే గోవును వదిలి, పులి దగ్గరకు పోతే ఏమవుతుందని ప్రశ్నించారు. ‘బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేసినందుకా? అన్నింటి ధరలు పెంచినందుకా? తెలంగాణ ఏర్పాటును కించపరిచినందుకా? గత మూడున్నరేండ్లలో ఆయన ప్రజల కోసం చేసిన ఉద్యమం ఒక్కటైనా ఉందా?’ అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.