హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. శాసనసభలోని కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటువేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క వంతు వచ్చింది. ఎన్నికల అధికారులు ఇచ్చిన బ్యాలెట్పేపర్పై ఎన్డీఏ అభ్యర్థికి టిక్ చేశారు. గ్రహించిన ఆమె తాను పొరపాటున ఓటు వేశానని, మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని ప్రిసైడింగ్ అధికారులను కోరారు.
అయితే నిబంధనల ప్రకారం మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బ్యాలెట్ పేపర్ను డ్రాప్ బాక్స్లో వేయకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. అధికారుల తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ఇప్పటివరకు 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా ఇక్కడే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.