Munugode by Poll Results | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. సిట్టింగ్ స్థానమైన మునుగోడును నిలబెట్టులేకపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలువలేకపోయింది. దుబ్బాక, హుజుర్నగర్, హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు తాజాగా జరిగిన మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. అధికార పార్టీకి కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రచారాన్ని మునుగోడు ప్రజలు నమ్మలేదు. కేసీఆర్కే పట్టం కట్టారు. రెండో రౌండ్ ఫలితం వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో కకావికలమైంది. ఊహించిన ఓట్లు కూడా పోల్ కాలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు మినహా అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం హుజుర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ తరఫున శానంపూడి సైదిరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఇక మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి పోటీ చేశారు. మొత్తంగా పాల్వాయి స్రవంతి మూడో స్థానానికి పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించి, రికార్డు సృష్టించింది.
సూర్యాపేట – జగదీశ్ రెడ్డి
నల్లగొండ – కంచర్ల భూపాల్ రెడ్డి
దేవరకొండ – రవీంద్ర నాయక్
నాగార్జున సాగర్ – నోముల భగత్
తుంగతుర్తి – గ్యాదరి కిశోర్
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
మిర్యాలగూడ – నల్లమోతు భాస్కర్ రావు
కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్
హుజుర్నగర్ – శానంపూడి సైదిరెడ్డి
భువనగిరి – పైళ్ల శేఖర్ రెడ్డి
ఆలేరు – గొంగిడి సునీత