Kodad | ఉమ్మడి రాష్ట్రంలో కోదాడ అభివృద్ధి కుంటుపడింది. ఈ నియోజకవర్గం నుంచి వేనేపల్లి చందర్రావు నాలుగు పర్యాయాలు గెలిచారు. ఎలాంటి ప్రగతి పనులు చేపట్టలేదు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్రెడ్డి రెండుసార్లు, ఉత్తమ్ పద్మావతి ఒకసారి ఎన్నికయ్యారు. వీళ్లు రాజకీయంగా ఎదిగారు తప్ప, ప్రజల అవసరాలు తీర్చలేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంలా మారింది నియోజకవర్గ పరిస్థితి. వేనేపల్లి హయాంలో వెలవెల పోగా, ఉత్తమ్ దంపతులవి ఉత్తమాటలుగానే మిగిలాయి.
రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది. కోదాడ నుంచి బొల్లం మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ప్రత్యేక చొరవతో నలభై ఏండ్లలో జరుగని అభివృద్ధిని నాలుగున్నరేండ్లలో చేశారు. రూ.2,400 కోట్ల నిధులు తీసుకువచ్చారు. ముమ్మరంగా ప్రగతి పనులు చేపట్టారు. ఇప్పుడు నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమంతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
గోదావరి జలాలు కోదాడ నియోజకవర్గాన్ని ముద్దాడాయి. మోతె, నడిగూడెం, మునగాల మండలాల్లో 18 వేల ఎకరాలకుపైగా బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయి. రూ.21 కోట్లతో 5 చెక్డ్యాంల నిర్మాణంతో 3 వేల ఎకరాలు సాగు అవుతున్నది. శాంతినగర్, పాలవరం, మోతె, గోండ్రియాల, కోదాడలలో భూగర్భ జలాలు పెరిగాయి. పంటలు పుష్కలంగా పండుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.31 కోట్లతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. 1,400 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేశారు. మరో 1,400 ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.60 కోట్ల 79 లక్షలు అందాయి. రూ.493 కోట్లు వెచ్చించి 118 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
రోడ్లకు మహర్దశ
2014 తర్వాత నియోజకవర్గంలోని రోడ్లకు మహర్దశ పట్టింది. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ విభాగం కింద రూ.200 కోట్లతో ప్రతి గ్రామంలోనూ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.11 కోట్లతో అనంతగిరి – అమీనాబాద్, రూ.7 కోట్లతో శాంతినగర్ – నడిగూడెం, రూ.6 కోట్లతో కోదాడ – మేళ్లచెర్వు, రూ.7.5 కోట్లతో చిలుకూరు – జెర్రిపోతుల గూడెం, బరాఖత్గూడెం- నడిగూడెం, రూ.22.5 కోట్లతో నడిగూడెం – కాగితారామచంద్రాపురం, మునగాల- కేతవారిగూడెం వరకు రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. పంచాయతీరాజ్ విభాగం కింద 63 కిలోమీటర్ల మేర రూ.45 కోట్లు వెచ్చించి గ్రామీణ రహదారులు నిర్మించారు. రూ.20 కోట్లతో 460 కిలోమీటర్ల మేర మరమ్మతులు, రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, రూ. 30 కోట్లతో డ్రైనేజీలు ఏర్పాటు అయ్యాయి.
సుందరంగా కోదాడ పట్టణం
రూ.80 కోట్లతో కోదాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డివైడర్ల విస్తరణ, సింగిల్ హార్మోన్ లైట్లతో పాటు శ్మశాన వాటికలు, రూ.60.65 కోట్లతో పచ్చదనం, ప్రకృతి వనాలు, రూ.4 కోట్లతో స్ట్రోం వాటర్ డ్రెయిన్ల నిర్మాణం, రూ.3.45 కోట్లతో మురుగుకాల్వలు, రూ.3.11 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం, రూ.25.08 కోట్లతో వాటర్ ట్యాంకు, పైప్లైన్లు, రూ.3 కోట్లతో అనంతగిరి రోడ్డు, బాలాజీనగర్లో వైకుంఠధామాలను నిర్మించారు. రూ.31 కోట్లతో పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుదీకరణ, వంటశాలలు, ప్రహరీలను నిర్మించారు.
వెలుగులు నింపిన దళితబంధు
గుడిబండ గ్రామంలో వంద మంది దళితులకు రూ.10 కోట్లతో పలు రకాల యూనిట్లను అందజేశారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కింద లబ్ధిదారులకు రూ.22 కోట్లు ఇచ్చారు. 44,142 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. నిరుపేదలకు రూ.25 కోట్లతో ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేశారు. కల్యాణలక్ష్మి కింద 6,859 మంది లబ్ధిదారులకు 60.79 కోట్లు ప్రభుత్వం అందించింది. 118 గ్రామాలలో మిషన్ భగీరథ తో స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందిస్తున్నది.
మెరుగైన వైద్య సేవలు
రూ.కోట్లు వెచ్చించి మునగాలలో నూతన ప్రభుత్వ దవాఖాన, రేపాల, త్రిపురవరం, అనంతగిరి, మోతె, చిలుకూరులో దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేశారు. దవాఖానల్లో అంతర్గత రోడ్లు నిర్మించారు. కోదాడలో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.