Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): హస్తం పార్టీ అధిష్ఠానానికి టీ కాంగ్రెస్లోని వర్గపోరు తలనొప్పిగా మారింది. ఖమ్మంలో జూలై 2న నిర్వహించబోయే సభ కాంగ్రెస్లో చిచ్చురేపింది. ఈ సభను పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేరిక కోసం నిర్వహించాలా? లేక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభగా నిర్వహించాలా? అనే దానిపై టీపీసీసీలో ఏకాభిప్రాయం కుదరలేదు.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేరికను హైప్ చేస్తూ సభ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పట్టుబడుతుండగా, భట్టి విక్రమార్క పాదయాత్ర 100 రోజుల ముగింపు సభగా నిర్వహించాలని రేవంత్రెడ్డి వ్యతిరేక వర్గం భీష్మించుకు కూర్చున్నది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల వ్యూహం చర్చించేందుకు ఈ భేటీ జరిగినప్పటికీ.. ప్రధానంగా ఖమ్మం సభ, టీపీసీసీ నేతల మధ్య కీచులాటలకే పరిమితమైంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలు, పార్టీ నుంచి సీనియర్లను బయటికి పంపేందుకు జరుగుతున్న కుట్రలపై సీనియర్ల ఫిర్యాదులతో చర్చ పక్కదోవ పట్టినట్టు తెలిసింది. పార్టీ నేతల మధ్య ఇదే విధంగా కీచులాటలు కొనసాగితే తెలంగాణలో అధికారంలోకి రావడం కల్లేనని పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. కనీసం ఎన్నికల వరకైనా అందరినీ కలుపుకొని వెళ్లకపోతే పార్టీ ఎవరినీ ఉపేక్షించబోదని రేవంత్రెడ్డిని పరోక్షంగా రాహుల్ గాంధీ హెచ్చరించినట్టు తెలిసింది.
పార్టీ మారుతున్నట్టు తమపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సందర్భంగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. టీ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తనకు పూర్తిగా సమాచారం ఉన్నదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని పార్టీలో చేర్చుకొనే విషయంపై తనకు మాట మాత్రమైనా సమాచారం లేదని ఆ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి ప్రస్తావించబోగా, ఎన్నికల వరకు గొడవలను పక్కన పెట్టాలని సూచించినట్టు సమాచారం.
ఖమ్మం సభపైనే ప్రధాన చర్చ
ఖమ్మంలో జూలై 2న జరుగబోయే సభపైనే ఎక్కువ సేపు చర్చ జరిగినట్టు సమాచారం. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేరికకు వేదికగా సభ జరగాలని రేవంత్రెడ్డి వాదించగా, ఆయన వ్యతిరేక వర్గీయులు మాత్రం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 100 రోజుల పాద యాత్ర ముగింపు సభగా జరపాలని పట్టుబట్టారు. పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అలాంటప్పుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖర్చంతా భరించి తన చేరికకు ఏర్పాటు చేసుకొన్న సభను భట్టి పాదయాత్ర ముగింపుగా ఎలా నిర్వహిస్తారని రేవంత్రెడ్డి వాదించినట్టు తెలిసింది. పార్టీలో ఇప్పటికే అగ్రకులాల ఆధిపత్యం పెరిగిందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నదని, దీన్ని చెరిపేసేందుకు భట్టి ముగింపు సభగా నిర్వహించడం మంచిదని రేవంత్రెడ్డి వ్యతిరేక వర్గం నేతలు గట్టిగా వాదించినట్టు సమాచారం.
రేవంత్రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాల వాదనతో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్టీలో చేరకముందే ఆయనపై రేవంత్రెడ్డి వర్గంగా ముద్రపడిందని పార్టీ నాయకుడు ఒకరు వాపోయారు. భట్టి పాదయాత్రను తక్కువ చేసి చూపేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని సీనియర్లు ఆరోపించారు. ఖమ్మం సభ ఏ విధంగా నిర్వహించాలన్న దానిపై టీపీసీసీ నేతల మధ్యనే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీ పెద్దలు ఎటూ తేల్చకుండానే అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే బయటికి మాత్రం స్ట్రాటజీ మీటింగ్ ప్రశాంతంగా జరిగినట్టు మీడియాకు వెల్లడించడం గమనార్హం.