కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 13: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి టీ భక్తవత్సలం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్ అందుకొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధి బాలాజీనగర్ డివిజన్లోని కేపీహెచ్బీ కాలనీకి చెందిన ఆయన వయస్సు 67 సంవత్సరాలు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పిం ఛన్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. మంగళవారం బాలాజీనగర్ డివిజన్లో ఎమ్మెల్యే కృష్ణారావు చేతులమీదుగా పంపిణీ చేసిన ఆసరా పింఛన్, గుర్తింపు కార్డును అందుకొన్న భక్తవత్సలం.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా భక్తవత్సలం మాట్లాడుతూ.. తాను 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని.. కాంగ్రెస్లో కొనసాగుతూ సేవలందించానని తెలిపారు. వయోభారం పెరగడంతో ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడిం చారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడినైన తనను పిలిచి మరీ ఆసరా పింఛన్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తంచేశారు. పార్టీలకతీతంగా వృద్ధులందరికీ ఆసరా పింఛన్లు ఇస్తుండటం చాలా గొప్ప విషయమని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.