హైదరాబాద్: కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీపై ఎక్స్ వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం జరిగిన ట్వీట్ల వార్లో మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే తలదూర్చాడు. ‘అబద్ధాలు, అవకతవకల విషయంలో కేటీఆర్ కూడా బీజేపీని అనుసరిన్నట్లుగా కనిపిస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగలుగా మారినందున ఇలాంటి అబద్ధపు ప్రచారాలు వారికి నిత్యకృత్యంగా మారుతాయనడంలో సందేహం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను, వార్తలను తిప్పికొట్టడానికే కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయబోతున్నది’ అంటూ ఎక్స్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక్ ట్వీట్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘హాయ్ ప్రియాంక్ గారు. మీరు కూడా ఈ ఇష్యూలో చేరాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం. మీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ కర్ణాటక యువతకు 2 లక్షల ఉద్యోగాలిస్తామని చేసిన ప్రకటన, మీ డిప్యూటీ సీఎం ఖజానా ఖాళీగా ఉందని చేసిన ప్రకటనలు కూడా తప్పుడువేనా..?’ అని ప్రశ్నించారు. ‘దోస్తూ.. తెలంగాణలో ముగ్గురు ఎంపీలు సహా బీజేపీ పెద్ద తలకాయలన్నింటిని ఓడించింది మేమే. కాంగ్రెస్ పార్టీ కాదు. సునీల్ అండ్ టీమ్ ప్రచారంపట్ల మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది’ అని సూచించారు.
Hi Priyank Ji
Glad you too decided to join the issue.
Are these statements from your leader Rahul Gandhi about employment to 2lakh Karnataka youth and from Deputy CM on empty treasury also Fake?
Buddy, we defeated all the BJP bigwigs in Telangana including all three of their… https://t.co/jFC2nF0TgU pic.twitter.com/pkIstc5Yg5
— KTR (@KTRBRS) December 20, 2023
కాగా, మంగళవారం సిద్ధరామయ్యకు సంబంధించిన ఓ వీడియోను కేటీఆర్ పోస్ట్చేస్తూ హామీల అమలుపై సందేహం వ్యక్తంచేశారు. ఖజానాలో డబ్బు లేదంటూ ఎన్నికల హామీలపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతున్నదా..? అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, ఇక తెలంగాణ ప్రజల భవిష్యత్తు కూడా కర్ణాటక మాదిరిగానే అవుతుందేమోనని అనుమానం వ్యక్తంచేశారు. హామీలను గుప్పించే ముందు వాటి సాధ్యాసాధ్యాలపై కనీసం ప్రాథమిక అధ్యయనం చేయడం కానీ, ప్రణాళికలు రూపొందించుకోవడం కానీ ఉండదా..? అని ప్రశ్నించారు.
‘ఎన్నికల్లో ఓట్లకోసం ఏదో అన్నాం. అది ఇస్తాం.. ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీగా ఇవ్వా లా..? మాకు ఇవ్వాలనే ఉన్నది. కానీ ఖజానాలో డబ్బులు లేవు’ అని సిద్ధరామయ్య అసెంబ్లీలో పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను కేటీఆర్ పోస్టు చేస్తూ పై సందేహాలు వెలిబుచ్చారు. పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కూడా ఇలాంటి ప్రకటనే చేయనున్నారా..? అనే సందేహం కూడా వ్యక్తంచేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రేవంత్, రాహుల్గాంధీ ఇచ్చిన హామీల వీడియోలు, పేపర్ క్లిప్పింగ్లను పోస్ట్చేశారు.
కేటీఆర్ ట్వీట్పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎక్స్ ద్వారా స్పందించారు. ‘తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా…? కనీసం మీరు ఫేక్ వీడియోలు, ఎడిటెడ్ వీడియోలను కూడా గుర్తించలేకపోతున్నారు. బీజేపీ వాళ్లు ఫేక్, ఎడిటెడ్ వీడియోలను సృష్టిస్తే మీ పార్టీ వాటిని వైరల్ చేస్తున్నది. మీ పార్టీ బీజేపీకి పర్ఫెక్ట్ బీ టీమ్. మీరు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే గతంలో బీజేపీ నాయకులు సృష్టించిన ఫేక్, ఎడిటెడ్ వీడియోలపై నేను చేసిన ప్రకటన చదవండి. బీజేపీ నాపై బురద జల్లే బాధ్యతను మీ పార్టీలోని కొందరు నాయకులకు అప్పగించింది. వారు నా వీడియోలను ఎడిట్చేసి ఫేక్ వీడియోలను సృష్టించి వైరల్ చేస్తారు. ఫేక్ వీడియోలకు బీజేపీ పెట్టింది పేరు. అది భారతీయ జనతా పార్టీ కాదు. ‘బోగ్లే జనతా పార్టీ’. ఇప్పుడు ఆ పార్టీ నేతలు నరేంద్రమోదీ నుంచి సీటీ రవి వరకు పూర్తిగా ఫేక్ వీడియోలపైనే ఆధారపడ్డారు’ అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
సిద్ధరామయ్య ట్వీట్పై కేటీఆర్ మళ్లీ స్పందించారు. ‘అబద్ధపు హామీలతో మీ పార్టీ (కాంగ్రెస్) వాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేశారు. కాబట్టే మేము ఎన్నికల్లో ఓడిపోయాం. డిసెంబర్ తొమ్మిదిన ఎన్నికల హామీలు అమలు చేస్తామని, హామీలపై చట్టాలు చేస్తామని చేసిన ప్రకటనలు ఏమయ్యాయి..? డిసెంబర్ తొమ్మిది దాటి పది రోజులు గడిచినా మీ పార్టీ ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేరలేదు’ అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కో హామీపై ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే ఇష్యూలో దూరాడు. కేటీఆర్ ఆయనకు కూడా తగిన కౌంటర్ ఇచ్చారు.