Chidambaram | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి దారుణంగా అవమానించింది. సారీ అన్న ఒక్క మాటతో అమరుల ఆత్మలు ఘోషించేలా చేసింది. తెలంగాణ ఉద్యమంతో ఆటలాడిన నాటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం.. మరోసారి తెలంగాణ అమరుల త్యాగాలను పూచికపుల్లలా తీసిపడేశారు. బలిదానాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదని తేల్చి పడేశారు. ప్రజా ఉద్యమాల్లో ప్రజల మరణాలు సహజమని తేలిగ్గా చెప్పేశారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ‘ఆత్మహత్య అనేది దురదృష్టకర ఘటన.
ప్రజా ఉద్యమంలో కొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందుకు సారీ. (some people lost their lives in the agitation.. we are sorry for that) . కానీ ఆ ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు’ అని ప్రకటించారు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో వందలమంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు ఈ చిదంబరమే కారకుడు. 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి.. అంతలోనే సమైక్యవాదుల లాబీయింగ్కు భయపడి వెనక్కు తీసుకొన్నారు. ఈ రెండు ప్రకటనలు చేసింది చిదంబరమే. ఆయన ప్రకటన వల్లనే నిర్వేదంలోకి వెళ్లిన అనేకమంది తెలంగాణ ఉద్యమకారులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆ బలిదానాలపై కనీస విచారం వ్యక్తంచేయకుండా ‘సారీ’ అన్న ఒక్క మాటతో తేల్చిపడేశారు. నిజానికి తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కేంద్రానికి ఎంత బాధ్యత ఉన్నదో.. చిదంబరానికి కూడా అంతే బాధ్యత ఉన్నది.
రాష్ట్ర ఏర్పాటు అనేది పిల్లలాట కాదని చిదంబరం చెప్పుకొచ్చారు. ఎంతో కసరత్తు తర్వాత, ఎన్నో చర్చల తర్వాతనే 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్టు ప్రకటించాం అని తెలిపారు. మరి అంత కసరత్తు చేసి, అంతగా చర్చలు జరిపిన తర్వాత ఆ ప్రకటన నుంచి ఎందుకు వెనక్కు వెళ్లారు? రాష్ట్ర ఏర్పాటు పిల్లలాట కాదన్నది మీరే.. ఎంతో కసరత్తు తర్వాత ప్రకటన చేశామన్నది మీరే.. మరి అంత సీరియస్గా చర్చించి నిర్ణయం తీసుకొన్న తర్వాత ఎందుకు వెనక్కు తగ్గారు? చిదంబరానికి ఆ నిర్ణయం చాలా చిన్నదై ఉండవచ్చు. కానీ, తెలంగాణకు 1200 వందల మంది గొప్ప భవిష్యత్తు ఉన్న యువకుల ప్రాణార్పనలు. వారి ప్రాణాలను తిరిగి తీసుకురాగలరా? వారి కుటుంబాల వ్యధను తీర్చగలరా? ఇంత చేసి కూడా ‘మా బాధ్యత లేదు’ అని ఎలా తప్పించుకొంటారు? చిదంబరం తాను చెప్పిన విషయాన్ని తానే ఖండించుకొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన 1200 మంది బలిదానాలకు బాధ్యత తమది కాదంటున్న కాంగ్రెస్ నేత చిదంబరం.. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నాలుగు వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని.. దానికి రాష్ట్ర సర్కారు బాధ్యత వహిస్తుందా? అని కొత్త చర్చను లేవనెత్తారు. తద్వారా ఉదాత్త ఆశయంతో ప్రాణత్యాగం చేసిన అమరులను చిదంబరం అవమానించారు. సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొనేవారితో అమరులను పోల్చి ప్రాణత్యాగాన్ని అపహాస్యం చేశారు. వారి ఆత్మలను క్షోభపెట్టారు. ప్రాణత్యాగం చేసినవారంతా ఉద్యమకారులు, ఉద్యమ భావజాలంతో తెలంగాణే శ్వాసగా బతికిన యువతే. దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చాల్సిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాగతీత ధోరణితో నిస్సహాయ స్థితిలో, కనీసం తమ చావుతోనైనా కేంద్రం కండ్లు తెరుస్తుందనే ఆశతో తనువు చాలించారు.
ఇవి సాధారణ ఆత్యహత్యలుగా చిదంబరం చిత్రీకరించారు. ఒక ఆశయసాధనలో అసువులు బాసిన అమలరును కీర్తిస్తూ వారి కుటుంబాలకు ఉద్యోగాలు, పరిహారం ఇవ్వటం దేశంలో కొనసాగుతున్న ఆనవాయితీ. అందుకే తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. సాధారణంగా ఆత్మహత్య చేసుకోవటం నేరమనే విషయం ఒక లాయర్గా, కేంద్రహోంమంత్రిగా పనిచేసిన చిదంబరానికి తెలియదనుకోలేం. బలిదానాలపై నిర్మితమైన తెలంగాణ అస్థిత్వాన్ని కించపరుస్తూ చిదంబరం సరిదిద్దుకోలేని నేరం చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో కొన్ని వేలమంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఆ పార్టీ పాలనలో వేలమంది రైతులు ఉరికొయ్యలకు వేలాడారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి?
తెలంగాణ ప్రజల పోరాటానికి తలవంచే కేంద్రం తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిందని చిదంబరం చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని అన్నారు. మరోవైపు మలిదశ తెలంగాణ ఉద్యమానికి సీఎం కేసీఆరే ముఖచిత్రమని పేర్కొన్నారు. అందుకే ఆయన సీఎం అయ్యారని చెప్పారు. ‘ఉద్యమం జరిగినప్పుడు కేసీఆరే ప్రామినెంట్ లీడర్. అందుకే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. నిజానికి సీఎం కేసీఆర్ ఎన్నడూ తెలంగాణను తానొక్కడినే తెచ్చానని చెప్పలేదు. ప్రతి సభలోనూ ‘ఒక్కో తెలంగాణ బిడ్డ ఒక్కో పులిలా కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొన్నాం’ అని స్పష్టంగా చెప్తున్నారు.
తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండేందుకు సమైక్య రాష్ట్రం కోసం గొప్ప ఉద్యమం జరిగిందని చిదంబరం మరో ఆణిముత్యం వదిలారు. ఈ విషయం సీఎం కేసీఆర్కు తెలియదని చెప్పుకొచ్చారు. ఇంతకూ సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం ఎక్కడ జరిగిందో ఈ కుహనా మేధావి చెప్పనే లేదు. నిజానికి ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు ఆలోచనను కూడా తెలంగాణ సహించలేదు. సమైక్యాంధ్ర ప్రతిపాదనకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు జరిగాయి. ఆంధ్రప్రాంతం నుంచి ఉద్యోగులు అక్రమంగా చొరబడటం, ఆంధ్రప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంతో కలపాలన్న ఆలోచనలను వ్యతిరేకిస్తూ 1952లోనే ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ అంటూ భారీ ఉద్యమం జరిగింది.
ఉద్యమాన్ని అణగదొక్కేందుకు హైదరాబాద్లోని సిటీ కాలేజీలో విద్యార్థులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పులు, అందులో ఏడు మంది ప్రాణాలను బలిగొన్న విషయాన్ని చిదంబరం మర్చిపోయారా? 1955 మార్చి 5వ తేదీన హైదరాబాద్ను, ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడంపై నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. ‘తెలంగాణ అనే ఒక అమాయకపు అమ్మాయిని, ఆంధ్ర అనే తుంటరి అబ్బాయికి ఇచ్చి పెండ్లి చేస్తున్నాం. వాళ్లు కలిసి ఉండొచ్చు. ఇమడలేకపోతే విడిపోవచ్చు’ అని చెప్పిన మాటలు చిదంబరానికి తెలుసా? తెలంగాణకు ఇష్టం లేకపోయినా ఆంధ్రతో కలుపుతున్నామని నెహ్రూ పరోక్షంగా ఆనాడే చెప్పారు.
అటు ఆంధ్రాలోనూ పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసి మరణించడానికి కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. చిదంబరం ఈ మాత్రం చరిత్రను తెలుసుకోకపోవడం సిగ్గుచేటు. నిజానికి ఆంధ్రావారిని నడిరోడ్డుమీదికి తోసేసిందే ఈ చిదంబరం రాష్ట్రీయులు. 1950 వరకు మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్న ఆంధ్రా, రాయలసీమవారు తమకు స్వరాష్ట్రం కావాలని డిమాండ్చేస్తే.. 24 గంటల్లో మద్రాస్ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని డెడ్లైన్ విధించింది చిదంబరం పూర్వీకుడైన సీ రాజగోపాలా చారీయే. 1951లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే.. 1956 వరకు హైదరాబాద్ స్టేట్ను ఆంధ్రాతో కలిపేవరకు జరిగిందంతా ఆంధ్రుల లాబీయింగే తప్ప.. ఎక్కడా ఒక్కరోజు ఉద్యమం కూడా జరుగలేదు. దుర్మార్గం ఏమంటే ఆ లాబీయింగ్లో రెండువైపులా ఉన్నది కాంగ్రెస్వారే కావటం. 5 ఏండ్ల లాబీయింగ్కు తలొగ్గి ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ.. మరి తెలంగాణ ఉద్యమాన్ని 60 ఏంట్లపాటు ఎందుకు పట్టించుకోలేదు?
వంటగ్యాస్ సిలిండర్ ధరలు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయని చిదంబరం చెప్పారు. కానీ, వంటగ్యాస్ సిలిండర్ ధరలు జీఎస్టీ పరిధిలో ఉన్నాయన్న విషయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరానికి తెలియకపోవటం విషాదం. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్పై కేంద్రం ఐదు శాతం, రాష్ర్టాలు ఐదు శాతం పన్నులు మాత్రమే విధించేందుకు అవకాశం ఉన్నది. అంతకన్నా ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసే అవకాశమే లేదు. చిదంబరం చెప్పిన మరో అబద్ధం. తెలంగాణ అప్పులు పెరిగిపోయాయని. అప్పుల్లో తెలంగాణ దేశంలోనే చివరి నుంచి ఐదో స్థానంలో ఉన్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ చెప్పాయి. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలన్నీ తెలంగాణను మించి అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని చిదంబరం తెలుసుకొంటే మంచిది.