ప్రజలు నమ్మకనే పక్కన పెట్టారు
వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాలమయమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలో ఆ పార్టీ దుకాణం బంద్ అయినట్టేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. శనివారం ఆయన తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్లో కొత్తదనమేమీ లేదని అన్నారు.
2014, 2018 ఎన్నికల సందర్భంగా చెప్పిందే మళ్లీ చెప్పారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రక్తపుటేరులు పారించిన చరిత్ర కాంగ్రెస్దేనని, అమరుల కుటుంబాలను పరామర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంపిన వాళ్లే సంతాపం చెప్పినట్టుగా రాహుల్గాంధీ వ్యవహారం ఉన్నదని మండిపడ్డారు. కుంభకోణాల కాంగ్రెస్ను ఎవరూ నమ్మరని, పదేండ్లుగా ప్రజలు ఛీత్కరించుకున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధిరావడం లేదని విమర్శించారు. తెలంగాణ ఎవరి భిక్షకాదని, అనేక పోరాటాల ద్వారా కాంగ్రెస్ మెడలు వంచి సాధించుకొన్నామని స్పష్టంచేశారు. అబద్ధాలు ప్రచారం చేయటంలో కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయని ఓఆర్ఎఫ్ (అబ్జర్వ్ రిసెర్చ్ ఫౌండేషన్) వెల్లడించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేతగానితనం వల్లే దేశంలో బీజేపీ ఆరాచక పాలన సాగుతున్నదని దుయ్యబట్టారు. సమావేశంలో ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ది ఫ్రస్ట్రేషన్ సభ: బాల్క సుమన్
కాంగ్రెస్ వరంగల్లో శుక్రవారం నిర్వహించినది రైతు సంఘర్షణ సభ కాదని, ఫ్రస్ట్రేషన్ సభ అని ప్రభు త్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్ కొత్త థియేటర్లో పాత సినిమా మాదిరిగా ఉన్నదని అన్నారు. దేశంలో గుణాత్మక మార్పులకు దారితీసే ప్రత్యామ్నాయ ఎజెండాను సీఎం కేసీఆర్ చర్చకు పెడితే, దాని నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. శనివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ తెలంగాణపై దండయాత్రకు దిగాయని, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశాన్ని రెండు జాతీయ పార్టీల నుంచి విముక్తం చేయాలని ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు. రాహుల్గాంధీ ఏ హోదాలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారని ప్రశ్నించారు. అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.