తుంగతుర్తి, జూలై 5 : ఈ నెల 3న ప్రకటించిన కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకాలు కాంగ్రెస్లో మరోసారి చిచ్చురేపాయి. ఆదివారం కొమ్మలలో కాంగ్రెస్ నాయకుల నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ధరూరి యోగా నందచార్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సామేలు పలు సమావేశాల్లో 50 వేల మెజార్టీతో గెలిచానని గొప్పగా చెప్పుకొంటున్నారని ఎద్దేవాచేశారు. సామేలును చూసి ఓట్లు వేయలేదని, కాంగ్రెస్ పార్టీని చూసి ఓటర్లు ఓట్లు వేశారని చెప్పారు.
దమ్ముంటే రాజీనామాచేసి గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. వార్డు మెంబర్గా కూడా గెలువని సామేలును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను చేసిందని చెప్పారు. వెంటనే మండల అధ్యక్షుల నియామకాలు రద్దు చేయకుంటే ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడండి.. ఎమ్మెల్యే డౌన్డౌన్ అంటూ అర్వపల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దీంతో జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.