హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): రాజ్యసభ సీటును ఆశించిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలకు నిరాశ తప్పలేదు. వారిని పక్కనపెట్టి వలస కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్ సన్నిహితుడు, సలహాదారు వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ సీటు ఖరారైంది. ఢిల్లీ అధిష్ఠానం ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి గురువారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. రాజ్యసభ సీటు కోసం పలువురు సీనియర్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. జీవన్రెడ్డి, వీ హనుమంతరావు, చిన్నారెడ్డి, కోదండరెడ్డి, మధుయాష్కీగౌడ్, జగ్గారెడ్డితోపాటు పలువురు నేతలు ప్రయత్నించారు. అయితే, సీనియర్లకు దక్కకుండా ముఖ్యనేత పావులు కదిపారనే ప్రచా రం జరిగింది.
సీనియర్ నేతలకు రాజ్యసభ సీటు దక్కితే, తన పట్టు సడిలిపోతుందని భావించిన ముఖ్యనేత.. తన అనుయాయుల నే బరిలో నిలపాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. తనకు ఆత్మబంధువుగా పేరున్న వేం నరేందర్రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఢిల్లీలో భారీ లాబీయింగ్ చేసి తన ఆత్మబంధువుకు రాజ్యసభ సీటు వచ్చేలా చేశారనే చర్చ జరుగుతున్నది. దీంతో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడ్డ తమలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా రాజకీయాలకు, లాబీయింగ్కు ప్రాధాన్యం ఇచ్చారంటూ రగిలిపోతున్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్కు ఉన్న బలాన్ని బట్టి ఒక్క సీటును కచ్చితంగా గెలుచుకుంటుంది. ఆ స్థానానికి ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేరును ఖరారు చేసింది. దీంతో ఇప్పుడు మరో స్థానానికి పలువురు నేతలు పోటీ పడగా వేం నరేందర్రెడ్డికి ఖరారైంది. ఇద్దరు నేతలు గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ బరిలో నిలిస్తే, కాంగ్రెస్ రెండో సీటు గెలుచుకోవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.