కుదిరిన ఒప్పందాల్లో సగం అనుమానాస్పద సంస్థలవే!ఐదువేల మంది వివిధ దేశాల ప్రతినిధులు వస్తారంటూ మూడునెలలుగా ఊదరగొట్టారు. రెండురోజుల క్రితం మూడువేల మంది వస్తారంటూ మాటమార్చారు. 150మంది గ్లోబల్ పెట్టుబడిదారులు, 18మంది ముఖ్యమంత్రులు వస్తారని ప్రచారం చేశారు. తీరా చూస్తే వచ్చింది గుప్పెడు మంది! వారిలోనూ పేరెన్నికగన్నవాళ్లు ఎవరూ లేరు. ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇటువైపు చూడలేదు. సర్కారు చెప్తున్న పెట్టుబడుల బండారమూ తొలిరోజే బయటపడింది. సగం సూట్కేసు, అనుమానాస్పద కంపెనీలే ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు నెలల కిందట లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభమైన కంపెనీ.. తెలంగాణలో రూ.5,600 కోట్ల పెట్టుబడి పెడుతుందట! రూ.53 వేల ఆదాయం ఉన్న మరో సంస్థ.. రాష్ట్రంలో 31వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందట! నమ్మాలంతే!!
హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): ‘అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ (Global Summit) నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 150మంది కార్పొరేట్ దిగ్గజాలు ఇందులో పాలుపంచుకుంటారు. అనేక రాష్ర్టాల సీఎంలు, దేశ, విదేశీ అతిథులు వస్తారు. తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తాయి’.. ఇదీ ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) చేసిన ప్రచారం. దావోస్ను మించిన ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిలుస్తుందని మూడు నెలలుగా ఊదరగొట్టింది. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర మంత్రులను, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించారు. వివిధ రాష్ర్టాల సీఎంలను ఆహ్వానించేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
వారు స్వయంగా వెళ్లి 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి, గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. వారంతా సమ్మిట్కు హాజరవుతారని, వారి ఆగమనం రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు ఇచ్చింది. తీరా సోమవారం మీర్ఖాన్పేట్లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ తుస్సుమనిపించింది. ముఖ్యమంత్రి చెప్పినట్టు ప్రముఖ దిగ్గజాలు ఎవరూ సదస్సులో కనిపించలేదు. కొద్దోగొప్పో పేరున్న అంతర్జాతీయ కార్పొరేట్ వ్యాపారవేత్తలు ఎవరూ అటువైపు చూడలేదు. సినీనటుడు నాగార్జున మాత్రమే వేదిక మీద ప్రముఖంగా కనిపించారు. మొత్తంగా గ్లోబల్ సమ్మిట్ కాస్తా లోకల్ సమ్మిట్గా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతని.. ఇంతని.. ఊదరగొట్టి
తమ పోటీ ఏపీతోనో, బెంగళూరుతోనో కాదనీ, అభివృద్ధి చెందిన జపాన్, కొరియా లాంటి దేశాలతో పోటీపడతామని సీఎం రేవంత్రెడ్డి పదే పదే చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా ఒక ఎత్తు.. గ్లోబల్ సమ్మిట్ తరువాత మరో ఎత్తు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఈ సమ్మిట్ తర్వాత తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడుల వరద పారుతుందని ఆర్భాటం చేశారు. విజన్ డాక్యుమెంట్-2047 ద్వారా తెలంగాణను శక్తివంతమైన రాష్ట్రంగా మలుస్తామని ప్రకటనలు ఇచ్చా రు. ఇందులో.. క్వాంటమ్ కంప్యూటర్స్, ఏఐ సిటీ రూపకల్పన, వివిధ రంగాల మైక్రో డాటా నిల్వ చేసుకునేలా సొంతంగా క్లౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటు, విదేశాల్లోని మేధో సంపత్తిని పరిశోధనల కోసం ఆహ్వానించడం, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించడం, ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలే కాదు.. ఉద్యోగాలు సృష్టించే మానవ వనరులకే పెద్దపీట అని విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వం పేరొన్నది. ఇందులో భాగంగా తొమ్మిది రంగాలపై సరారు ప్రత్యేకంగా దృష్టిసారించి, వాటిని ఆచరణలోకి తీసుకొచ్చేలా విసృ్తత కార్యాచరణ రూపొందించుకున్నది. స్వచ్ఛ ఇంధనం, స్మార్ట్ రవాణా, పారిశ్రామిక కర్బన ఉద్గారాలను తగ్గించడం, వ్యవసాయంలో మార్పులు, అడవుల పెంపు, పట్టణ మౌలిక వసతుల్లో మార్పు.. ఇలా తొమ్మిది అంశాల్లో తన విధానాలను ప్రపంచం ముందుపెట్టింది.
రూ.2 లక్షల కోట్ల ఎంవోయూలట?
గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో తొలిరోజు ఏ ఒక్క రంగానికి చెందిన ప్రముఖులు కూడా కనిపించలేదు. 44 దేశాల నుంచి, ప్రముఖ కంపెనీల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పుకొచ్చారు. చివరికి స్థానికంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి నటుడు నాగార్జున, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభన కామినేని, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ రాగా, విదేశాల నుంచి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్ హాజరయ్యారు. అయినా తొలిరోజు రూ.2 లక్షల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. అందులో అన్నీ చిన్నా, చితక స్థానిక కంపెనీలతో పాటు, ఊరు పేరు లేని సూట్కేసు కంపెనీలతో ఒప్పందాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖం చాటేసిన నేతలు
గ్లోబల్ సమ్మిట్కు కర్ణాటక రాష్ట్రం నుంచి డీకే శివకుమార్ మాత్రమే హాజరయ్యారు. ఏఐసీసీ నుంచి నేతలు ఎవరూ హాజరుకాలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గానీ ఇండియా కూటమి నేతలు గానీ రాకపోవటం గమనార్హం. పార్లమెంట్లో వందేమాతరం, ఎస్ఐఆర్ తదితర అంశాల మీద చర్చ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాలేకపోయారని చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమ్మిట్లో పాల్గొనటం గమనార్హం.
స్వరం మార్చిన ప్రభుత్వం
రెండు రోజుల నుంచి డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్వరం మార్చారు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి సదస్సు జరుగుతోందంటే.. అది పెట్టుబడులను ఆకర్షించేందుకే అని భావిస్తారు. కానీ అసలు ఈ సదస్సు పెట్టుబడుల కోసం కాదు అని శ్రీధర్బాబు ప్రకటించారు. ఈ సమ్మిట్ తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చెయ్యడానికే అని చెప్పారు. ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు గానీ, ఎంవోయూలు కుదుర్చుకో.వడానికి కూడా ఆసక్తి చూపిస్తే ఆహ్వానం పలుకుతామని మంత్రి అన్నారు. పెట్టుబడుల కోసం కాకపోతే ఇంత హంగామా, హడావుడి దేనికి అని, విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చెయ్యడానికి.. వీవీఐపీలు, వీఐపీలూ కావాలా? అంటూ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్కు ఆశించిన స్పందన లేకపోవడంతో, పరిస్థితిని ముందే ఊహించి ఇలా స్వరం మార్చారని విమర్శిస్తున్నారు.