హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): బీసీల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని జనగణన వేదిక జాతీయ కన్వీనర్ గోసుల శ్రీనివాస్యాదవ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీబంధు పథకంతోపాటు పలు పథకాలను నిలిపేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నదని, ఇది సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. అర్హులైన బీసీలకు పథకాలు దరిచేరేలా మార్గదర్శకాలను పటిష్ఠం చేయాలని, పథకాలను మాత్రం రద్దు చేయొద్దని కోరారు. గొర్రెల పంపిణీ, బీసీ బంధు, చేనేత పథకాలను యథావిధిగా అమలు చేయాలని కోరారు.