Gurukula Recruitment | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు రాజకీయ ఆకాంక్షలకు ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయాన్ని బలి తీసుకుంటున్నది. హడావుడిగా పోస్టుల భర్తీ చేపట్టింది. కటాఫ్ మార్కుల జాబితాలను ప్రకటించకుండానే, అభ్యర్థులు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, డిమాండ్లపై స్పష్టత ఇవ్వకుండానే నియామక పత్రాలు అందించింది. ఇటు సర్కారు, అటు ట్రిబ్ తీరుతో గురుకుల అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరుతో మరోవైపు మళ్లీ భారీగా బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
రోజుల వ్యవధిలోనే.. అంతా గోప్యంగా!
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 క్యాటగిరీల్లో పీజీటీ 1276, టీజీటీ 4020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టుల భర్తీ ప్రక్రియను గత ప్రభుత్వం చేపట్టగా, ట్రిబ్ గత ఆగస్టులోనే రాత పరీక్ష నిర్వహించింది. ఎన్నికల కోడ్, కోర్టు కేసుల నేపథ్యంలో నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆ సమస్యలు తొలగడంతో ఎంపికైన అభ్యర్థులకు ట్రిబ్ నియామక పత్రాలిచ్చింది.
అయితే డిగ్రీ లెక్చరర్, అటు తరువాత జేఎల్, ఆ తర్వాత పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తామని తొలుత వెల్లడించిన ట్రిబ్.. అందుకు విరుద్ధంగా పోస్టుల భర్తీకి చేపట్టింది. డీఎల్, జేఎల్ పోస్టులను నింపకుండానే తొలుత నేరుగా పీజీటీ, పీడీ, లైబ్రేరియన్, డీఎల్, జేఎల్, టీజీటీ పోస్టుల భర్తీని చేసేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే ట్రిబ్ గత నెల 6న తొలుత పీడీ పోస్టులకు సంబంధించి 1ః2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసింది.
అటు తరువాత 9న లైబ్రేరియన్, అదే 9న పీజీటీ పోస్టుల మెరిట్ జాబితాను ప్రకటించి, ఆ మరుసటి రోజున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టింది. 20న డీఎల్, 22న జేఎల్, 26న టీజీటీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. డెమోలను, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను మొత్తంగా 25 రోజుల్లోనే పూర్తి చేసింది. 24 గంటలు తిరగకముందే ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసి, నియామక పత్రాలను అందజేసింది. క్యాటగిరీల వారీగా కటాఫ్ మార్కుల జాబితాను ట్రిబ్ వెల్లడించలేదు. పూర్తిగా గోప్యతను పాటిస్తున్నది. ఇదేమిటని అడిగితే మొత్తం ఎంపిక ప్రక్రియ పూర్తయిన తరువాత కటాఫ్ మార్కుల ప్రకటిస్తామని ట్రిబ్ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో అభ్యర్థుల్లో అనుమానాలకు తావిస్తున్నది.
ప్రకటించని దివ్యాంగుల కోటా
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించింది. నిబంధనల ప్రకారం దివ్యాంగుల కోటా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మరోసారి నిర్వహించాల్సిన వైద్య పరీక్షలను ట్రిబ్ నిర్వహించలేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రోజున దివ్యాంగ అభ్యర్థులకు 2-3 రోజుల్లో ఉస్మానియా వైద్యశాలలో మెడికల్ టెస్ట్ ఉంటుందని ట్రిబ్ అధికారులు వెల్లడించారు. కానీ అవేమీ నిర్వహించకుండానే నేరుగా పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అదీగాక ఇటీవల డీఎల్, జేఎల్, టీజీటీ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించినా దివ్యాంగుల కోటాకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను మాత్రం ప్రకటించలేదు.
రిలిక్విష్మెంట్పై స్పష్టత కరువు
వాస్తవంగా రిలిక్విష్మెంట్ను గతంలోనే తొలగించారు. అంటే గురుకులాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మూడేండ్ల వరకు ఉద్యోగాన్ని వదిలిపోబోమని, ఒకవేళ వదిలేస్తే రూ.లక్ష జరినామా చెల్లిస్తామని, ఆ ఉద్యోగాన్ని మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒప్పంద పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. రిలిక్విష్మెంట్ ప్రధాన ఉద్దేశం బ్యాక్లాగ్లు ఏర్పడకుండా చూడటం. అయితే ప్రస్తుతం అభ్యర్థులు రిలిక్విష్మెంట్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డికి ఎక్స్ వేదికగా నివేదించారు. అందుకు సీఎం సైతం సానుకూలంగా స్పందించారు. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించి ట్రిబ్కు మాత్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదు.
రాజకీయ ప్రయోజనాల కోసమే..!
త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం హడావుడిగా పోస్టుల భర్తీ చేపట్టిందని గురుకుల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడి మేరకే చేపడుతున్నామని ట్రిబ్ అధికారులే వెల్లడిస్తుండడం అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. ఎన్నికల కోడ్ వస్తుందన్న సాకుతో ఇష్టానుసారంగా ఫలితాలు వెల్లడించారని, ఫలితంగా చాలా మందికి అన్యాయం జరిగిందని అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నారు. డిసెండింగ్ ఆర్డర్లో పోస్టుల భర్తీ చేయాలని, ఫలితంగా 80%మందికి న్యాయం జరిగే అవకాశముందని తెలుపుతున్నారు. ప్రభుత్వం పోస్టులను బ్యాక్లాగ్ చేయడం కోసమే ఇలా చేస్తున్నదని నిప్పులు చెరుగుతున్నారు.
ఇప్పటికే కోర్టు మెట్లెక్కిన పీడీ అభ్యర్థులు
ఇదిలా ఉంటే నియామక ప్రక్రియను నిరసిస్తూ గురుకుల అభ్యర్థులు ఇప్పటికే ధర్నాలు నిర్వహించారు. పీజీటీ అభ్యర్థులు ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టారు. ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తులు సమర్పించారు. గురుకుల అభ్యర్థులు ఇటీవల సంక్షేమ భవన్లోని ట్రిబ్ కార్యాలయానికి భారీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ట్రిబ్ చేపట్టిన భర్తీ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు పీడీ అభ్యర్థులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. సోమవారం పిటిషన్ విచారణకు రానున్నది.
జాబితాలో అనర్హులు
హడావుడిగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్డడంతో చాలా మంది అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులకు ఉద్యోగాలకు దక్కాయని, రూల్ రిజర్వేషన్ అమలుపై గందరగోళం నెలకొందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. స్కూల్ పీడీ పోస్టులకు ట్రిబ్ గత ఏప్రిల్ 24 నుంచి మే 24వ వరకు దరఖాస్తులు స్వీకరించింది. 2023, ఏప్రిల్ 5 నాటికి పీడీ పోస్టులకు సంబంధించిన అన్ని పరీక్షలు పాసైన అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. కానీ ప్రస్తుతం ట్రిబ్ నోటిఫికేషన్కు విరుద్ధంగా గత అక్టోబర్లో, ఆ తర్వాత పాసైన అభ్యర్థులకు సైతం పోస్టింగ్ ఇచ్చిందని అభ్యర్థులు చెబుతున్నారు.