మంచిర్యాల టౌన్, నవంబర్ 6: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మొదలైంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా నాయకత్వాన్ని భుజాలకెత్తుకొని నడిపించిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్రావు పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మరో రెండు రోజుల్లో న్యాయం జరుగకపోతే తానే కొత్త పార్టీని స్థాపిస్తానని అల్టీమేటం జారీ చేశారు. శనివారం సాయంత్రం మంచిర్యాలలో సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి సరైన స్పందన రాకపోతే ‘ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్’ పేరిట కొత్త పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతున్నది. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాను 21 ఏండ్లుగా పార్టీలో కొనసాగుతున్నానని, ఎన్ని అవమానాలు ఎదురైనా భరించానని కార్యకర్తల వద్ద ప్రేమ్సాగర్రావు వాపోయినట్టు సమాచారం. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పినట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఎన్నికైన తర్వాత ఇటీవల ఖానాపూర్, నిర్మల్, బోథ్ మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యతనివ్వడాన్ని ప్రేమ్సాగర్రావు జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం.