హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రెడ్లకు అధికారం ఇవ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీసీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రేవంత్ వ్యాఖ్యలు బీసీలను కించపరిచేలా ఉన్నాయంటూ బీసీ నేతలంతా మూకుమ్మడిగా తాడో పేడో తేల్చుకొనేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ రెడ్లది అయితే తామంతా పార్టీలో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ..‘రెడ్లకు నాయకత్వం, అధికారం ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలో కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీసీలను కాంగ్రెస్కు దూరం చేసేందుకు రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే పార్టీని రెడ్ల కాంగ్రెస్గా మార్చారని, రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి బీసీ నేతలకు ప్రాధాన్యం తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమను అడుగడుగునా అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కీలకమైన బీసీ నేతలందర్నీ పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే రెడ్లకు అధికారం ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారని ఆరోపిస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చి.. పార్టీ చరిత్ర తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో బీసీ కీలక నేతలంతా సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. రేవంత్రెడ్డిని ఇలాగే వదిలేస్తే భవిష్యత్లో పార్టీలో బీసీలకు చోటు దక్కడం కలగానే మిగిలిపోతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తంచేస్తున్నారు.
నేనెందుకు పార్టీలో ఉండాలి:ఏఐసీసీ అధికార ప్రతినిధి బక్క జడ్సన్
రేవంత్రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి బక్క జడ్సన్ నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బలహీన వర్గానికి చెందిన నేను కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎందుకు ఉండాలో చెప్పాలి’ అంటూ ప్రశ్నించారు. తాను 32 ఏండ్లుగా పార్టీకి నిబద్ధత గల కార్యకర్తగా పని చేస్తున్నానని, గతంలో ఎప్పుడూ ఇలాంటి విభజన రాజకీయాలు చూడలేదని మండిపడ్డారు.
ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నా…:ఏలేటి మహేశ్వర్రెడ్డి
రేవంత్ వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి బహిరంగంగా ఖండించారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చెందిందని, అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
రెడ్డి కాంగ్రెస్గా మార్చారు: బండ్ల గణేశ్
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రెడ్డి కాంగ్రెస్గా మారిందంటూ రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. మీ పార్టీ సొంత అధ్యక్షుడే తెలంగాణలో పార్టీని బొంద పెట్టాడంటూ విమర్శించారు.