నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్రెడ్డి, బండి సంజయ్ అధికారం కోసం పగటి కలలు కంటున్నారని, అందుకే అరాచకంగా మాట్లాడుతున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి భాష, సంస్కృతిని ఎన్నడూ చూడలేదని.. వీరి మాటల తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏండేండ్లు సామరస్యపూరిత పాలన, సుస్థిర అభివృద్ధితో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని.. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర మంత్రుల పాత్ర ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం గుత్తా మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17కు బీజేపీకి సంబంధమే లేదని.. 1951లో జనసంఘ్, 1980లో బీజేపీ పుట్టాయని తెలిపారు. నాటి పోరాటంలో బీజేపీ పాత్ర జీరోనని, దాన్ని ఒక ఆట వస్తువుగా మార్చేసిందని విమర్శించారు. ప్రస్తుతం బీజేపీ అరువు తీసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి కాంగ్రెస్ హోంమంత్రి కాదా అని నిలదీశారు. బీజేపీ నేతలు చరిత్రను మరుగు పరిచే కుట్రలు మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎంఐఎంను బూచీగా చూపుతూ ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టాలని కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, ఇప్పటికే ఆ కోటపై జాతీయ జెండా ఎగురుతున్నదని సూచించారు.
తెలంగాణ సాధించింది కేసీఆరే
తెలంగాణ సాధించిన ఘనత 100 శాతం కేసీఆర్కే దక్కుతుందని, ఆయనతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని గుత్తా సుఖేందర్రెడ్డి ఉద్ఘాటించారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. బీజేపీ నేతలకు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, విభజన చట్టంలోని అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడరైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా సీఎం కేసీఆర్ పట్ల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎప్పుడు పొద్దుగూకుతుందా? ఎక్కడా దావత్ దొరకుతుందా? అని ఎదురుచూసే సంస్కృతి కాంగ్రెస్ నేతలదేనని ఎద్దేవాచేశారు. రాజకీయాల్లో గౌరవప్రదంగా వ్యవహరించడం, మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.