హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : రైతులు మాత్రమే ఓటర్లుగా ఉండే, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నేరుగా తలపడేందుకు కాంగ్రెస్ సర్కార్ జంకుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏ ఎన్నిక జరిగినా రైతుల ఆగ్రహం చవిచూడక తప్పదన్న భయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే చర్చ నడుస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక మండళ్లను నామినేటెడ్ విధానంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. రైతులు తమకు ఉన్న ఓటుహక్కు ద్వారా ఎన్నుకోవాల్సిన పాలకమండళ్లను రైతులతో సంబంధం లేకుండా నామినేటెడ్ విధానంలో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సహకార సంఘాల్లో దొడ్డిదారిన పాగా వేసేందుకు కాంగ్రెస్ కుటిల యత్నం చేస్తున్నదనే విమర్శలొస్తున్నాయి.
రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటిలో రైతులు తమ ఓట్లతో పాలక మండళ్లను ఎన్నుకొంటారు. ఇక్కడే కాంగ్రెస్ సర్కార్కు భయం పట్టుకున్నది. రేవంత్ సర్కార్ విధానాలు రైతులను తమకు దూరం చేస్తున్నాయనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. యూరియా పంపిణీ మొదలుకొని పంటల కొనుగోళ్ల వరకు ప్రతి దశలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల కొనుగోళ్ల కోసం కొండకు ఎదురు చూసిననట్టు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు కాంగ్రెస్ సర్కార్పై పీకల్లోతు కోపంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పీఏసీఎస్ ఎన్నికలు నిర్వహిస్తే రైతులెవరూ కాంగ్రెస్ మద్దతుదారులకు ఓట్లు వేసే ప్రసక్తి ఉండదని, ఘోర ఓటమి తప్పదనే భయం ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయని, ఇప్పుడు సహకార ఎన్నికల్లోనూ ఓడిపోతే కోలుకోలేని దెబ్బ పడుతుందనే ఆందోళన కాంగ్రెస్ సర్కార్ను వెన్నాడుతున్నది. అందుకే రైతులు ఓట్లు వేయకుండా అసలు ఎన్నికలనే రద్దు చేసే కుట్రకు సర్కార్ తెరలేపిందనే విమర్శలొస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఏసీఎస్లకు నామినేటెడ్ విధానంలో పాలకమండళ్ల ఎంపికపై చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించకుండా నాన్ అఫీషియల్ పీఐసీ కమిటీలను ఏర్పాటు చేస్తూ, 2025 జూలై 8న ఉత్తర్వులు జారీ చేసింది. చైర్పర్సన్, ఇద్దరు పర్సన్స్తో కలిపి ముగ్గురితో కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్నది. ఏపీలో ముగ్గురుతో ఏర్పాటు చేయగా తెలంగాణలో ఐదుగురు లేదా ఎనిమిది మందితో ఏర్పాటు చేసే ఆలోచనతో సర్కార్ ఉన్నదని సమాచారం. ఒక్కో పాలకమండలిలో గరిష్ఠంగా 13 మందిని నియమించుకోవచ్చు. దీని ప్రకారం ఎంతమందిని నియమిస్తుందనేది ప్రభుత్వం ఇష్టం. 18 కాలమ్ ప్రొఫార్మా ప్రకారం సొసైటీలో సభ్యులైన వారినే కమిటీలో నియమిస్తారు.
పీఏసీఎస్ల పాలకమండళ్ల పదవీకాలం గత సంవత్సరం ఫిబ్రవరితో ముగిసింది. పాలకమండళ్లకు రెండుసార్లు పొడిగింపు ఇచ్చింది. ఆ తర్వాత పర్సన్ ఇన్చార్జులుగా అధికారులను నియమించింది. దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతున్నది. మెజారిటీ పాలకమండళ్లలో బీఆర్ఎస్ నేతలున్నారు. ఈ కమిటీలు గ్రామాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో నెలకొన్నది. ఈ నేపథ్యంలో అసలు ఈ కమిటీలనే తొలిగించి, వారి స్థానంలో కాంగ్రెస్ కార్యకర్తలను నియమిస్తే ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే ఆలోచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో మళ్లీ బీఆర్ఎస్ నాయకులే గెలిచే అవకాశం ఉంటుందని, కాబట్టి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తే తమకు ఇబ్బందులు ఉండవనే ఆలోచన చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే నామినేటెడ్ విధానాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్ కార్యకర్తలకు పదవుల పందెరానికి తెరతీసిందనే విమర్శలొస్తున్నాయి. పీఏసీఎస్లకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్లను ఏర్పాటుచేసిన తరువాత డీసీసీబీలు, టెస్కాబ్, మార్క్ఫెడ్ చైర్మన్లను సైతం నామినేటెడ్ విధానంలోనే నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని సమాచారం.