హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) సీటు అంటే ఇప్పుడు హాట్కేక్. ఈ ఒక్క కోర్సులో సీటు దక్కితే చాలని విద్యార్థులనుకొంటారు. అంత డిమాండ్ ఉన్న ఈ కోర్సులో వచ్చిన సీట్లను పలువురు విద్యార్థులు వదిలేసుకొన్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్లో ఈ పరిస్థితి నెలకొన్నది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోవడం, ట్యూషన్ ఫీజు చెల్లించకపోవడంతో 6,258 మంది విద్యార్థులు సీఎస్ఈ సీట్లను వదులుకొన్నారు. సీఎస్ఈలో 23,467 సీట్లుంటే, 23,162 సీట్లును కేటాయించారు. గడువు ముగిసేనాటికి వీరిలో 16,904 మంది విద్యార్థులే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. 6,258 మంది సీఎస్ఈలో సీటు వచ్చినా చేరకుండా వదిలేశారు. వీరం తా తమకు నచ్చిన, సమీపంలో ఉన్న కాలేజీల్లో సీట్లు రాకపోవడం లేదా పేరొందిన కాలేజీల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు రావడంతో వదిలేసినట్టుగా అంచనాలేస్తున్నారు. మొదటి విడత 82,666 సీట్లుంటే, 70,665 సీట్లను కేటాయించారు.. వీరిలో 52,541 విద్యార్థులు మాత్రమే రిపోర్ట్చేశారు. దీంతో 18,124 మంది విద్యార్థులు కేటాయించిన సీట్ల పట్ల అయిష్టత చూపారు. కీలకమైన సీఎస్ఈలో కాకుండా మిగతా కోర్సుల్లో ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. ఇక మొదటి విడతలో భర్తీకానీ సీట్లు, విద్యార్థులు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయకపోవడంతో మొత్తం 30,125 సీట్లు మిగిలాయి. వీటిని రెండో విడత కౌన్సెలింగ్లో భర్తీచేయనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.