పటాన్చెరు, జూలై 2: దేశ రక్షణ విషయంలో రాజీపడేది లేదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మం డలం భానూర్ పరిధిలోని బీడీఎల్ సంస్థలో వార్హెడ్ బిల్డింగ్ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు బీడీఎల్ మెయిన్ గేట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం వర్చువల్ విధానంలో కంచన్బాగ్ యూనిట్లో ఆర్ఎఫ్ సీకర్ ఫెసిలిటీ, ఏపీలోని వైజాగ్ యూనిట్లో సెంట్రల్ స్టోరేజ్ ఫెసిలిటి, పశ్చిమ గోదావరి జిల్లా మాధవరంలో బీడీఎల్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను, జిమ్నాజియం, సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ.. దేశ రక్షణ అవసరాలను తీర్చడంలో బీడీఎల్ పాత్ర ప్రశంసనీయమన్నారు. మిస్సైల్ రంగంలో దేశం అత్మనిర్భర్ సాధనపై దృష్టిపెట్టిందని తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంలో అమృత్ మహోత్సవ్ను నిర్వహించుకునే వేళ దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఏపీజే అబ్దుల్కలాం ఆశయాల మేరకు బీడీఎల్ ఉత్పత్తులు ఉంటున్నాయని పేర్కొన్నారు. రక్షణరంగ బలోపేతానికి మిస్సైల్మాన్ కలాం చేసిన సేవలను కొనియాడారు. స్వదేశీ టెక్నాలజీని, దేశీయంగానే రక్షణ పరికరాలను తయారు చేసుకొంటున్నామని తెలిపారు.