హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): భూము ల సమగ్ర సర్వే కోసం రూ. 400 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో త్వరలో డిజిటల్ సర్వేను ప్రారంభించే అవకాశం ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములను అత్యాధునిక పద్ధతుల్లో కొలిచి ప్రతి కమతానికి, ఇంటికి, ఆస్తికి అక్షాంశ, రేఖాంశాలు (కో ఆర్డినేట్స్) కేటాయించనున్నారు. వీటిని ఎవరూ మార్చలేరు. కాబట్టి భూ వివాదాలకు శాశ్వతంగా తెరపడనున్నది. భూరికార్డులు పారదర్శకంగా, డిజిటలైజ్ అయిన చోట జీడీపీ 3- 4% పెరుగుతుందని, నేరాలు తగ్గుతాయని, వ్యవసాయం పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో భూముల సమస్యలు పరిష్కారమైతే ప్రజలకు, ప్రభుత్వానికి లబ్ధి చేకూరుతుంది. తెలంగాణ భూ విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు. ఇందులో 1.60 కోట్ల ఎకరాలు వ్యవసాయభూమి, 67 లక్షల ఎకరాలు అటవీ భూమి, సుమారు 36 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి, మిగతావి ఆవాస ప్రాంతాలుగా, దేవాలయ, వక్ఫ్ భూములుగా ఉన్నాయి. ‘ధరణి’ పోర్టల్ నిర్వహణకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.47.62 కోట్లు కేటాయించింది.